Share News

RBI : ఇంగ్లండ్‌ నుంచి లక్ష కిలోల బంగారం!

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:43 AM

వంద టన్నుల బంగారం.. అంటే.. లక్ష కిలోలు! ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లండ్‌ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఖజానాకు చేరింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని

RBI : ఇంగ్లండ్‌ నుంచి లక్ష కిలోల బంగారం!

ఇంగ్లండ్‌ నుంచి లక్ష కిలోల బంగారం!

భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు

నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్‌కు ఈ స్థాయిలో తరలింపు

15 ఏళ్ల క్రితం ఐఎంఎఫ్‌ నుంచి ఆర్బీఐ 200 టన్నుల కొనుగోలు

కొన్నేళ్లుగా బంగారాన్ని కొంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో నిల్వ

విదేశీ మారక నిల్వల సంక్షోభంతో 1991లో బంగారం తనఖా

ఇప్పుడు 100 టన్నులను దించడం దేశ ఆర్థికశక్తికి నిదర్శనం: ఆర్బీఐ

ముంబై, మే 31: వంద టన్నుల బంగారం.. అంటే.. లక్ష కిలోలు! ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లండ్‌ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఖజానాకు చేరింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. మరి.. ఇంత బంగారం ఎక్కడిది? చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్‌ ఇదే చేసింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. పైగా కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున పుత్తడిని కొనుగోలు చేస్తూ వచ్చిన ఆర్బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో నిల్వచేస్తూ వస్తోంది. 2024 మార్చి నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. ఇందులో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. 2023లో 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ వ్యవధిలోనే నిరుడు కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది. కాగా ఇంగ్లండ్‌ నుంచి 100 టన్నుల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా కొన్నినెలల పాటు కసరత్తు చేసి భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించారు. విదేశీ మారక నిల్వల పరంగా నెలకొన్న సంక్షోభం కారణంగా మనదేశం 1991లో ఆర్బీఐ పెద్ద ఎత్తున బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చింది. దీన్నే ఆర్బీఐ వర్గాలు గుర్తుచేస్తూ.. ‘‘ఆర్థికంగా భారత దేశ సామర్థ్యం, విశ్వాసం ఏ స్థాయిలో ఉందనేది స్వదేశీ ఖజానాకు ఇంత పెద్దఎత్తున బంగారాన్ని చేర్చడమే చాటుతోంది’’ అని వ్యాఖ్యానించాయి. ‘‘కొన్నిఏళ్ల క్రితం నుంచి ఆర్బీఐ బంగారాన్ని కొనడం మొదలు పెట్టింది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చింది. విదేశాల్లో నిల్వలు పెరిగిపోవడంతో సర్దుబాట్లలో భాగంగా కొన్ని నిల్వలలను భారత్‌కు తరలించాలని నిర్ణయించాం’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Jun 01 , 2024 | 05:43 AM