Share News

Usha Chilukuri Vance: ట్రంప్ ప్రకటించిన ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ వాన్స్ భార్యకు ఏపీ మూలాలు

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:15 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ పేరును రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. సోమవారం మిల్వాకీలో సోమవారం జరిగిన సదస్సులో ట్రంప్‌కు నామినేషన్‌ను కూడా అందజేసింది.

Usha Chilukuri Vance: ట్రంప్ ప్రకటించిన ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ వాన్స్ భార్యకు ఏపీ మూలాలు
Indian American Usha Chilukuri Vanc

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ పేరును రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఖరారు చేసింది. సోమవారం మిల్వాకీలో సోమవారం జరిగిన సదస్సులో ట్రంప్‌కు నామినేషన్‌ను కూడా అందజేసింది. దీంతో ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా అత్యంత విధేయుడైన జేమ్స్ డేవిడ్ వాన్స్‌ పేరును ప్రకటించారు. కాగా డేవిడ్స్ వాన్స్ భార్య భారతీయ-అమెరికన్. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్. ఆమె మూలాలు మన ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి.


ఎవరీ ఉషా చిలుకూరి వాన్స్?

ఉషా చిలుకూరి వాన్స్‌కు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు భారతీయ వలసదారులుగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. ఉషా 1986లో పుట్టారు. ఆమె ఉన్నత విద్య అభ్యసించారు. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ప్రతిష్టాత్మక సంస్థలో కార్పొరేట్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు. ఉషా వాన్స్ వృత్తిపరంగా కూడా మంచి ట్రాక్ రికార్డును కలిగివున్నారు. న్యాయవాదిగా నామినేట్ అవ్వడానికి ముందు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్‌ వద్ద సహాయకురాలిగా పనిచేశారు. అంతేకాదు యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా, ది యేల్ లా జర్నల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. ఆమె తర్వాత ముంగెర్, టోల్లెస్, ఓల్సన్ సంస్థలకు కార్పొరేట్ న్యాయవాదిగా పనిచేశారు.


Untitled-6.jpg

వాన్స్‌తో పరిచయం ఇలా..

యేల్‌ యూనివర్సిటీలో నాలుగేళ్లపాటు పాఠ్యేతర కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత కేంబ్రిడ్జ్‌ నుంచి ఉషా చిలుకూరికి గేట్స్ ఫెలోషిప్ దక్కింది. దీంతో ఆమె తన అధ్యయనాలను కొనసాగించారు. కేంబ్రిడ్జ్‌లో వామపక్ష, ఉదారవాద బృందాలతో కలిసి పనిచేశారు. 2014లో డెమొక్రాట్‌ పార్టీ సభ్యురాలిగా ఆమె రిజిస్టర్ అయ్యారు. కాగా యేల్ లా స్కూల్‌లో స్కాలర్‌షిప్ పొందిన జేమ్స్ డేవిడ్ వాన్స్‌తో ఉషా చిలుకూరికి పరిచయం అయ్యింది. ఒకరినొకరు ఇష్టపడడంతో 2014లో ఈ జంట కెంటుకీలో పెళ్లి చేసుకున్నారు. ఒక హిందూ పూజారి ప్రత్యేక నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.


భర్త ఎదుగుదలకు సహకారం

ఉషా వాన్స్ తన భర్త జేమ్స్ డేవిడ్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా గ్రామీణంలో దిగజారుతున్న పరిస్థితులపై ఆయన ఆలోచనలకు ఒక రూపం తీసుకొచ్చి ‘హిల్‌బిల్లీ ఎలిజీ’ పేరిట బుక్‌గా రూపాంతరం చెందించారు. ట్రంప్ కుటుంబానికి వాన్స్ ఎలా దగ్గరయ్యారు వంటి ఆసక్తికరమైన విషయాలను ఇందులో పొందుపరిచారు. 2016లో ఈ బుక్ అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. గ్రామీణ అమెరికా ప్రజలు ట్రంప్‌ను ఏవిధంగా అధికారంలోకి తీసుకొచ్చారో ఈ బుక్‌లో వివరించారు. ఇక ఒహియో సెనేట్ సీటులో గెలుపు కోసం డేవిడ్ వాన్స్ ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆమె తనవంతు సహకారం అందించారు.


Untitled-8.jpg

ముగ్గురు పిల్లలు..

జేమ్స్ డేవిడ్ వాన్స్-ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్( 6), వివేక్(4), మిరాబెల్(2). రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తన భర్త ఎంపికైన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ మా జీవితాల్లో ఏ మార్పు రావాలని కోరుకోవడం లేదు. కానీ జేమ్స్‌పై నాకు నమ్మకం ఉంది. అతనంటే నాకు చాలా ప్రేమ. జీవితంలో ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. మరో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను మతపరమైన కుటుంబంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు హిందువులు. హిందుమతం వారిని మంచి తల్లిదండ్రులను చాలా మంచి వ్యక్తులుగా మార్చింది. అది చూస్తూ నేను పెరిగాను. జేమ్స్ వాన్స్ దేని కోసం ఆరాటపడుతున్నాడో నాకు. అది అతనికి సరైనదనిపించింది’’ అని ఆమె చెప్పారు. కాగా అమెరికా రాజకీయ వ్యవస్థలో భారతీయుల ప్రాబల్యం, మన సంస్కృతికి అక్కడి రాజకీయ నాయకులు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో తెలియజేస్తోంది.

Updated Date - Jul 16 , 2024 | 09:27 AM