Share News

DC vs RR: దంచికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్‌కి భారీ లక్ష్యం

ABN , Publish Date - May 07 , 2024 | 09:27 PM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసి.. మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగలిగింది.

DC vs RR: దంచికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్‌కి భారీ లక్ష్యం

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసి.. మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు జేక్ ఫ్రేసర్ (50), అభిషేక్ పోరెల్ (65), ట్రిస్టన్ స్టబ్స్ (41) విధ్వంసం సృష్టించడం వల్లే.. ఢిల్లీ అంత భారీ స్కోరు చేసి, రాజస్థాన్ 222 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకి ఓపెనర్లు అద్భుత ఓపెనింగ్ ఇచ్చారు. ముఖ్యంగా.. ఫ్రేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లోనే అర్థశతకం చేశాడంటే.. ఏ రేంజ్‌లో అతను చితక్కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత షాయ్ హోప్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్ పెద్దగా సత్తా చాటలేదు కానీ.. అభిషేక్ మాత్రం దుమ్ముదులిపేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా తాండవం చేశాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా.. 36 బంతుల్లో అతడు 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు.

ఇక చివర్లో వచ్చిన స్టబ్స్ సైతం అదరగొట్టేశాడు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేసి.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇలా వీళ్లు ముగ్గురు ఉతికారెయ్యడంతో.. ఢిల్లీ 221 పరుగులు చేయగలిగింది. మరి.. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేధిస్తుందా? ఆ జట్టులోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కాబట్టి, ఆ లక్ష్యాన్ని ఛేధించే అవకాశం ఉంది. మరి, హోరీహోరీగా సాగే ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - May 07 , 2024 | 09:27 PM