Share News

పాక్‌లో ఆడేది లేదు!

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:28 AM

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం దాదాపు అసాధ్యమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉంది. అయితే 8 జట్లు పాల్గొనే ట్రోఫీ ముసాయిదా షెడ్యూల్‌ను పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. దీని ప్రకారం భారత జట్టు

పాక్‌లో ఆడేది లేదు!

హైబ్రిడ్‌ పద్ధతి మేలు

ఇది బీసీసీఐ అభిప్రాయం

న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం దాదాపు అసాధ్యమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉంది. అయితే 8 జట్లు పాల్గొనే ట్రోఫీ ముసాయిదా షెడ్యూల్‌ను పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను లాహోర్‌లో ఆడాల్సి ఉంది. కానీ ఈ షెడ్యూల్‌కు బోర్డు ఆమోదం తెలపలేదని సమాచారం. ఎందుకంటే భద్రతా కారణాలరీత్యా పాక్‌లో అడుగుపెట్టకూడదన్న ఆలోచనలో బోర్డు ఉంది. అందుకే తమ మ్యాచ్‌లను దుబాయ్‌ లేదా శ్రీలంకలో ఆడించాలని ఐసీసీని గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. 2008 నుంచి భారత జట్టు పాక్‌లో పర్యటించడం లేదు. ‘చాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాక్‌కు వెళ్లకపోవచ్చు. దీనిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియాకప్‌ మాదిరి హైబ్రిడ్‌ పద్ధతిన భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌ లేక శ్రీలంకలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఐసీసీ కూడా ఇదే విషయంపై ఆలోచిస్తోంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2017లో చివరిసారి జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను ఓడించిన పాక్‌ విజేతగా నిలిచింది.

Updated Date - Jul 12 , 2024 | 05:28 AM