Share News

ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా

ABN , Publish Date - May 11 , 2024 | 07:08 AM

‘హిందూ సమాజమంతా నా వెనక ఉంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్‌లో వినోద్‌ కుమార్‌ ఓడిపోతే బీఆర్‌ఎ్‌సను మూసివేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా..?’’ అంటూ కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు

ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా

వినోద్‌ కుమార్‌ గెలవకపోతే కేసీఆర్‌ తప్పుకొంటారా..?

ముస్లింలు ఏకమై నన్ను ఓడించాలని కేసీఆర్‌ పిలుపు

బీఆర్‌ఎ్‌సను ఓడించి హిందువులు సత్తా చాటాలి

నేతన్నల దీనస్థితికి కారణం కేసీఆర్‌: బండి సంజయ్‌

సిరిసిల్ల, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘‘హిందూ సమాజమంతా నా వెనక ఉంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్‌లో వినోద్‌ కుమార్‌ ఓడిపోతే బీఆర్‌ఎ్‌సను మూసివేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా..?’’ అంటూ కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్‌ను ఓడించాలంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌ స్పందించారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్‌ను ఓడించి హిందువులు సత్తా చాటాలని కోరారు.

సిరిసిల్లలో శుక్రవారం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘కొడుకేమో జై శ్రీరామ్‌ అనొద్దని అంటాడు. తండ్రేమో ముస్లింలు అంతా ఒక్కటి కావాలని అంటున్నాడు. కరీంనగర్‌ అభివృద్ధిపై నేను మాట్లాడుతుంటే.. కేసీఆర్‌ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ముస్లిం మత పెద్దలతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యాడు.


హిందువుల గురించి హేళన చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి. హిందూ సమాజం సంఘటితం కావాలి’’ అని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సంజయ్‌ ఖండించారు. తెలంగాణకు రూ.10 లక్షల కోట్లదాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదని అన్నారు. కేసీఆర్‌ అరాచకాలను, ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తుంటే.. ఆ రెండు పార్టీలు కలిసి తనను ఓడించేందుకు డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. సిరిసిల్లలో కార్మికుల దీనస్థితికి పదేళ్ల కేసీఆర్‌ పాలనే కారణమని అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ చిన్న వాన తుంపర్లకే మునిగి పోతోందని, అవినీతికి అధిపతి కేసీఆర్‌ అన్నారు.

కాళేశ్వరం డీపీఆర్‌ అడిగితే ఇవ్వలేదని, ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా చేసి కేంద్రాన్ని బద్నాం చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని మండిపడ్డారు. ‘ప్రసాద్‌’ స్కీమ్‌ కింద వేములవాడ, కొండగట్టు అభివృద్ధి చేస్తామని కేంద్రం తరఫున లేఖ రాస్తే స్పందించని మూర్ఖుడని అన్నారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ నిధులపై ప్రమాణానికి సిద్ధమా అని సవాల్‌ విసిరారు. హిందువులు తుమ్మితే బీఆర్‌ఎస్‌ గాల్లో కొట్టుకుపోతుందని అన్నారు. భైంసాలో హనుమాన్‌ భక్తులు కేటీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు చనిపోయారని కేసీఆర్‌ హేళన చేయడం బాధాకరమని అన్నారు.

Updated Date - May 11 , 2024 | 07:08 AM