Share News

Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:05 AM

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కొత్తగూడెంలోని ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని శుక్రవారం బడికి వెళ్లేందుకు నిరాకరించింది.

Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

  • విధుల నుంచి సస్పెన్షన్‌.. కొత్తగూడెంలో ఘటన

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఆగస్టు 23: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కొత్తగూడెంలోని ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని శుక్రవారం బడికి వెళ్లేందుకు నిరాకరించింది. బోరున విలపిస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వేణు వారం రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇష్టమొచ్చినట్లు గిచ్చుతూ, గిల్లుతూ ఇతర శరీర భాగాలను తాకుతున్నాడని వాపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు బడికి వెళ్లి ఆందోళన చేపట్టారు. జరిగిన సంఘటన గురించి ప్రధానోపాధ్యాయురాలు సాయిసుజాతకు తెలిపారు. సదరు ఉపాధ్యాయున్ని తమకు అప్పగించాలని ఆందోళన చేశారు. దీంతో పాఠశాల సిబ్బంది కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు తెలుగు ఉపాధ్యాయుడు వేణును పోలీసులు అరెస్టు చేశారు. వేణుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వేణును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 04:05 AM