Share News

High Court : జగన్‌ అక్రమాస్తుల కేసులపై రోజువారీ విచారణ

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:43 AM

ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది.

High Court : జగన్‌ అక్రమాస్తుల కేసులపై  రోజువారీ విచారణ

  • జగన్‌ కేసులపై సీబీఐ కోర్టుకు మళ్లీ హైకోర్టు ఆదేశాలు

  • నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై23 (ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది. గత విచారణ సందర్భంగా ఈ నెల3న జారీచేసిన ఆదేశాలనే పునరుద్ఘాటించింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు హైకోర్టు ప్రత్యేకంగా ఆ కేసుల విచారణను పర్యవేక్షిస్తోంది. దీంతోపాటు జగన్‌ కేసుల్లో వేగవంతంగా విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిగుర్తింపు పొందిన కోర్టుల్లో విచారణలో ఎంతో కొంత పురోగతి కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు విషయానికొస్తే జగన్‌పై ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశించామని, ఆయా కేసుల్లో మరోసారి పురోగతి తెలియజేయాలని రిజిస్ర్టీని, సీబీఐ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

Updated Date - Jul 24 , 2024 | 03:43 AM