Share News

Illegal Constructions: అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:22 AM

చెరువులు, కుంటలు, నాలాలు, వాటి బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

Illegal Constructions: అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు

  • నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించినట్లు అభియోగాలు

  • దర్యాప్తు ప్రారంభించిన ఈవోడబ్ల్యూ

నిజాంపేట్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటలు, నాలాలు, వాటి బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు వారిపై తీవ్రమైన అభియోగాలు మోపుతూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎ్‌స)లోని పలు సెక్షన్లను నమోదు చేశారు. వీటిల్లో కొన్ని.. ఈ కేసు ఇక్కడితో ఆగిపోదు.. మున్ముందు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కూడా రంగంలోకి దిగుతుందని చెప్పకనే చెబుతున్నాయి. కొన్ని సెక్షన్లయితే.. ఏకంగా అవినీతి అధికారులు క్రిమినల్‌ ట్రెస్‌పాస్‌ చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి.


హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగానాథ్‌ స్వయంగా సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ రామకృష్ణ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ సుదాన్ష్‌, బాచుపల్లి తహసీల్దార్‌ పూల్‌సింగ్‌, ల్యాండ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌కుమార్‌, సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌ను నిందితులుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్న సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి కేసు నమోదు చేయాల్సిందిగా సీసీఎస్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులను ఆదేశించారు.


దాంతో అధికారులు బీఎన్‌ఎ్‌సలోని సెక్షన్లు 59(ప్రభుత్వోద్యోగి అక్రమాలకు పాల్పడడం), 49(కుట్రకు ప్రేరేపిత చర్యకు శిక్ష), 61(2)(నేరపూరితమైన కుట్రలో భాగస్వాములవ్వడం), 198(ప్రభుత్వోద్యోగి చట్టాన్ని గౌరవించకుండా ఇతరులకు హాని కలిగించే చర్యలు), 201(నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించడం), 316(5)(నమ్మకాన్ని వమ్ముచేయడం), 324(3)(ప్రభుత్వ ఆస్తికి నష్టం), 329(3)(క్రిమినల్‌ ట్రెస్‌పాస్‌) కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అధికారులకు ఈవోడబ్ల్యూ భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(నేర శిక్షా స్మృతి) కింద నోటీసులు జారీ చేసి, విచారణ జరపనుంది. ఒకవేళ అధికారులు తమ పరిధిని దాటి అడ్డగోలు అనుమతులు ఇచ్చినట్లు తేలితే.. వారికి శిక్ష పడే అవకాశాలున్నాయి. అంతేకాదు.. ఈ అనుమతుల వెనక రాజకీయ కోణంపైనా ఈవోడబ్ల్యూ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


  • ఇతర చట్టాలతో లింకులు

సెక్షన్‌ 59ని ప్రయోగించడాన్ని బట్టి.. అవినీతి అధికారులపై ఏసీబీ కూడా సమాంతర దర్యాప్తు చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఆదాయానికి మించిన ఆస్తులు, అడ్డంగా కూడబెట్టిన సంపద చిట్టాను వెలుగులోకి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించినట్లు సెక్షన్‌ 201ను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంటే.. భారతీయ సాక్ష్య సంహిత చట్టం కింద ఆధారాలను మార్చడంపైనా వీరికి కఠిన శిక్షలు ఉంటాయని తెలుస్తోంది.


నమ్మకాన్ని వమ్ముచేయడం, చట్టాన్ని గౌరవించకపోవడం వంటి సెక్షన్లు తదుపరి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు లేదా సర్వీసు నుంచి తొలగింపు వంటి తీవ్రమైన పరిణామాలకు మార్గాన్ని సుగమం చేస్తాయని, ఇతరులకు హాని కలిగించే చర్యలు(సెక్షన్‌ 198) ప్రకారం పర్యావరణ చట్టాల కింద.. ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లేలా చేయడం వంటి అభియోగాలతో.. నిందిత అధికారులకు తగిన జరిమానాలు విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు.

Updated Date - Sep 01 , 2024 | 03:22 AM