Share News

Harish Rao: రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

ABN , Publish Date - Aug 19 , 2024 | 11:14 AM

రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను రేవంత్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Harish Rao: రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్
HarishRao

హైదరాబాద్: రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (HarishRao) ప్రశ్నించారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను రేవంత్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలిపిన రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని చెప్పారు. పోలీసు యాక్ట్ (30 Act) పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని హరీష్‌రావు అన్నారు.


ఆవేదనలో అన్నదాతలు...

‘‘రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు’’ అని హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.


ప్రభుత్వం కండ్లు తెరవాలి..

‘‘నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుంది’’ అని ప్రభుత్వాన్ని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు.

Updated Date - Aug 19 , 2024 | 11:34 AM