Share News

Kavitha: 160 రోజుల తరువాత కవిత పోస్ట్..

ABN , Publish Date - Aug 29 , 2024 | 11:12 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సుప్రీం కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(Kalvakuntla Kavitha) కవిత బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న విషయం విదితమే.

Kavitha: 160 రోజుల తరువాత కవిత పోస్ట్..

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో సుప్రీం కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(Kalvakuntla Kavitha) కవిత బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్న విషయం విదితమే. దాదాపు 5 నెలలకుపైగా జైలు శిక్ష అనుభవించిన కవిత.. 160 రోజుల తరువాత గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తన నివాసం వద్ద ఉండగా తీసిన ఫొటోను ఆమె తన పోస్ట్‌కి జత చేశారు. 'సత్యమేవ జయతే'అనే క్యాప్షన్‌ని పోస్ట్‌కి ఇచ్చారు. కవితకు బెయిల్ రావడంతో సత్యం గెలిచిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు.


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీ..

ఐదున్నర నెలలు తనను అన్యాయంగా జైల్లో నిర్బంధించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత వాపోయారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని.. అపవాదుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడతానని చెప్పారు. ప్రజాక్షేత్రంలో తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి, ఐదున్నర నెలలు తిహాడ్‌ జైల్లో ఉన్న కవిత.. బెయిల్‌ లభించడంతో బుధవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన ఆమెకు కేటీఆర్‌ సతీమణి శైలిమ హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. అక్కడ సమీప బంధువులు, పార్టీ ముఖ్యులను ఆమె పలకరించారు. ఇంట్లోకి వెళ్లాక తల్లి శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. పూజామందిరంలోకి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం భర్త అనిల్‌కుమార్‌కు పాదనమస్కారం చేసి.. అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్లు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.


అంతకుముందు.. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో మంగళవారం రాత్రి 9:10 గంటలకు తిహాడ్‌ జైల్లోంచి కవిత బయటకొచ్చారు. 9:40 గంటలకు ఢిల్లీ వసంత్‌ విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకున్నారు.రాత్రి అక్కడే బస చేశారు. రాత్రి ఒంటి గంట దాకా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కవిత మాట్లాడుతూనే ఉన్నారని ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచే కవిత వర్చువల్‌గా హాజరయ్యారు. మధ్యాహ్నం 2.40కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు. సాయంత్రం 5:45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు కవితకు ఘనంగా స్వాగతం పలికాయి. వేల సంఖ్యలో చేరుకున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు.. ‘వాడెవ్వడు వీడెవ్వడు.. కవితక్కకు అడ్డెవ్వడు’... ‘కవితక్క కడిగిన ముత్యం’.. ‘కవితక్క నిప్పు.. కవితక్క సీఎం’ అంటూ నినాదాలు చేశారు.

For Latest News click here

Updated Date - Aug 29 , 2024 | 11:12 AM