Share News

దొడ్డు బియ్యం.. దొడ్డ భారం!

ABN , Publish Date - May 22 , 2024 | 05:22 AM

దొడ్డు బియ్యం పెద్ద భారంగా మారుతోంది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ దొడ్డు బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి.

దొడ్డు బియ్యం.. దొడ్డ భారం!

వాడకం లేదు.. పేరుకుపోతున్న నిల్వలు

సన్నాలకు డిమాండ్‌.. దిగుబడి తక్కువ

దీంతో సాగుకు అన్నదాతల వెనుకంజ

రూ.500 బోనస్‌తో ప్రోత్సాహం..

సన్నాలకే సై అంటారంటున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): దొడ్డు బియ్యం పెద్ద భారంగా మారుతోంది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ దొడ్డు బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. తెలంగాణలో గడిచిన రెండేళ్లుగా సన్నాల సాగు తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో దొడ్డు బియ్యం సాగు భారీస్థాయిలో పెరుగుతోంది. ఎంతలా అంటే.. మూడేళ్ల క్రితంతో పోలిస్తే.. దొడ్డు ధాన్యం దిగుబడి దాదాపుగా రెట్టింపైంది. సన్నధాన్యం దిగుబడి తక్కువగా ఉండడం.. నూక సమస్యలు ఎక్కువ కావడంతో రైతులు దొడ్డు బియ్యం వైపు మొగ్గు చూపుతున్నారు. సన్న బియ్యం సాగును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు.

సన్నాలకు డిమాండ్‌

మార్కెట్లో సన్నాలకు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. డిమాండ్‌కు - సరఫరాకు వ్యత్యాసం పెరుగుతుండడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లోనే కాదు.. తెలంగాణ ప్రభుత్వ పథకాల్లోనూ సన్నాలకు ప్రాధాన్యతనిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనాలకు ప్రభుత్వం సన్న బియ్యాన్నే పంపిణీ చేస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో సేకరించే దొడ్డు బియ్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేయించి.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌కార్డుదారులు, జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. ఇలా పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేయడానికి ఏటా 24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే అవసరం. ఉత్పత్తి మాత్రం 174 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంది. కేంద్రం కూడా దొడ్డు బియ్యం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో దొడ్డు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. రేషన్‌ కార్డుదారులు దొడ్డు బియ్యాన్ని తీసుకుంటున్నా.. తినడానికి మాత్రం ఇష్టపడడం లేదు. తమ కోటా బియ్యాన్ని అమ్ముకుంటున్న ఉదంతాలున్నాయి. దీంతో.. రేషన్‌ కార్డుల ద్వారా కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిజానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లింగ్‌ చేయిస్తున్న వాటిలో దొడ్డు బియ్యం వాటా 98ు ఉండగా.. మిగతా 2ులోపే సన్న బియ్యం ఉంటోంది.

ప్రోత్సాహకంతో రైతుల్లో మార్పు!

సన్నాలను పండించే రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున ప్రోత్సాహకమిస్తామని రేవంత్‌ సర్కారు ప్రకటించింది. దిగుబడి తక్కువ అనే ఒకేఒక్క కారణంతో సన్నాలకు దూరంగా ఉంటున్న రైతులు.. సర్కారు ప్రోత్సాహకంతో దొడ్డు ధాన్యం జోలికి వెళ్లరని అభిప్రాయపడుతోంది. తక్కువ దిగుబడికి జరిగే లోటును రూ.500 బోనస్‌ పూడ్చివేస్తుందని సర్కారు భావిస్తోంది. దొడ్డు ధాన్యాన్ని పండించే రైతులు.. సన్నాలవైపు మళ్లితే.. ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే.. డిమాండ్‌ నేపథ్యంలో ధరలు తగ్గడం, ఆహార భద్రత పథకానికి కూడా సన్నాలను పంపిణీ చేయడంతోపాటు.. దొడ్డు బియ్యం నిల్వల సమస్యను అధిగమించవచ్చని అభిప్రాయపడుతోంది.

Updated Date - May 22 , 2024 | 05:22 AM