Share News

ముదిరిన వివాదం.. కబేళాకు తాళం

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:24 PM

పాపన్నపేట, జూలై 23: పాపన్నపేట కబేళా వివాదం చివరకు గేటుకు తాళం పడే పరిస్థితికి దారితీసింది. కబేళా కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈవో క్రిష్ణప్రసాద్‌, ఎస్‌ఐ నరేష్‌ కలిసి గేటుకు తాళం వేసిన సంఘటన మంగళవారం జరిగింది.

ముదిరిన వివాదం.. కబేళాకు తాళం
ఏడుపాయల కబేళాకు తాళం వేస్తున్న ఈవో, ఎస్‌ఐ

ఏడుపాయల్లో ఉద్రిక్తత

పాపన్నపేట, జూలై 23: పాపన్నపేట కబేళా వివాదం చివరకు గేటుకు తాళం పడే పరిస్థితికి దారితీసింది. కబేళా కాంట్రాక్టర్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈవో క్రిష్ణప్రసాద్‌, ఎస్‌ఐ నరేష్‌ కలిసి గేటుకు తాళం వేసిన సంఘటన మంగళవారం జరిగింది. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల్లో జంతు బలి నిషేధం ఉంది. కానీ వేలాది భక్తులు అనునిత్యం మేకలు, గొర్రెలు కోసుకుంటూ విందులు చేసుకుంటారు. దీంతో ఆలయానికి కొంత ఆదాయం సమకూర్చాలని, పరిసరాల పారిశుధ్యం కాపాడాలని యోచించిన అప్పటి పాలకవర్గ చైర్మన్‌, నాటి ప్రజాప్రతినిధులు కలిసి మెదక్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు బేళా నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారు. 2019లో ఆ కాంట్రాక్టర్‌ కబేళా కోసం తన సొంత ఖర్చులతో ఏడుపాయల్లో ఓ బిల్డింగ్‌ నిర్మించారు. ఒక మూగ జీవం కట్‌ చేయడానికి రూ.25 చొప్పున దేవస్థానానికి చెల్లిస్తూ ఐదేళ్లపాటు కబేళా నిర్వహించుకోవాలని ధర్మకర్తలు తీర్మానించారు. అయితే 10 కిలోల లోపు బరువుగల జీవానికి రూ.400 20 కిలోల లోపు రూ.500, 20 కిలోల పైన రూ.600 భక్తుల వద్ద నుంచి అతడు వసూలు చేసుకోవచ్చునని తీర్మానించారు.

అధిక వసూళ్లంటూ గ్రామస్థుల ఆందోళన

మేకల కట్‌ చేసే క్రమంలో భక్తుల నుంచి కాంట్రాక్టర్‌ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆరోపిస్తూ 31 మార్చి 2024న నాగ్సాన్‌పల్లి గ్రామస్థులు ఏడుపాయల్లో ఆందోళనకు దిగి, కబేళాకు తాళం వేసి, వారే వసూళ్లకు దిగారు. దీంతో పాలకవర్గ చైర్మన్‌ బాలాగౌడ్‌, ధర్మకర్తలు, మండల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో జీవానికి రూ.25 చొప్పున చెల్లించాల్సిన కాంట్రాక్టర్‌ నయా పైసా చెల్లించలేదని, నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కాంట్రాక్టర్‌ను తొలగించాలని నిర్ణయించారు. 1 ఏప్రిల్‌ 2024 నుంచి ఆలయ ఉద్యోగుల ఆధ్వరం్యలో కబేళా నిర్వహిస్తున్నారు. గత తీర్మానం ప్రకారం తనకు ఇంకా 5 నెలల కాల పరిమితి ఉందంటూ సదరు కాంట్రాక్టర్‌ కోర్టు మెట్లు ఎక్కడం, కబేళాను తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఈవో క్రిష్ణప్రసాద్‌ పాపన్నపేట పోలీసుల సహాయంతో కబేళాకు తాళం వేశారు. ఈ విషయమై చైర్మన్‌ బాలాగౌడ్‌ మాట్లాడుతూ ఒక నెలలో సుమారు 1,500 మేకలు కోస్తారని, దానివల్ల ఆలయానికి ఎంత లేదన్నా నెలకు రూ.40 వేల ఆదాయం రావాల్సి ఉందన్నారు. ఈ లెక్కన చూస్తే కాంట్రాక్టర్‌ నిర్వహించిన 54 నెలలకు సుమారు రూ.20 లక్షల ఆదాయం రావాల్సి ఉందన్నారు. అలాగే నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ ధరలు వసూలు చేసి భక్తులను దోపిడీ చేయడంతో ధర్మకర్తలు, అధికారుల తీర్మానం మేరకు కబేళా కాంట్రాక్టర్‌ను తొలగించామన్నారు. ఈవో క్రిష్ణప్రసాద్‌ మాట్లాడుతూ వివాదం కోర్టు వరకు వెళ్లడంతో పాటు కొన్నిరోజులగా కబేళా వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కబేలా మూసివేశామని తెలిపారు.

Updated Date - Jul 23 , 2024 | 11:25 PM