Share News

KC Venugopal: గట్టిగా పనిచేయండి.. నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - May 08 , 2024 | 04:29 AM

దేశం దిశ, దశ మార్చే ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గట్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు.

KC Venugopal: గట్టిగా పనిచేయండి.. నిర్లక్ష్యం వద్దు

  • ఇవి దేశం దిశ, దశ మార్చే ఎన్నికలు.. ఉత్తరాదిన బీజేపీ పని అయిపోయింది

  • దక్షిణాదిలోనూ ఆ పార్టీని కట్టడి చేయాలి

  • ఇండియా కూటమిదే అధికారం

  • తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి

  • పనితీరును బట్టే పదవులు ఉంటాయి

  • పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్‌ దిశానిర్దేశనం

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): దేశం దిశ, దశ మార్చే ఈ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గట్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గియిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎంపీ స్థానాల గెలుపుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, దానికి అనుగుణంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పనితీరును బట్టే పదవులు ఉంటాయన్న సంకేతాన్నీ ఇచ్చారు. మంగళవారం పార్టీ ఎంపీ అభ్యర్థులు, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసీ వేణుగోపాల్‌ ఢిల్లీ నుంచి జూమ్‌ ద్వారా సమావేశమయ్యారు.


సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. బీజేపీ బలంగా ఉందంటున్న ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన మా ర్పులు చోటు చేసుకున్నాయని, ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీని పూర్తి స్థా యిలో కట్డడి చేయగలిగితే ఇండియా కూటమిదే అధికారం అని పేర్కొన్నారు. అలసత్వం ప్రదర్శించకుండా పోల్‌ మేనేజ్‌మెంట్‌పై అందరూ దృష్టి పెట్టాలని, పోలింగ్‌ బూత్‌ కేంద్రీకృతంగా పనిచేయాలని సూచించారు. పోలింగ్‌ రోజున పార్టీ సానుభూతిపరుల ఓట్లను ముందుగా వేయించాలని, పోలింగ్‌ శాతం పెరిగేట్లుగా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన చోట.. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలే ఆ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.


సమావేశానికి హాజరుకాని నేతలపై ఆరా!

లోక్‌సభ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోని పార్టీ నేతలపై కేసీ వేణుగోపాల్‌ సీరియస్‌ అయ్యారు. సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ సహా 15 మంది ఎమ్మెల్యేలు, పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరు కాలేదు. అయితే ఇంత కీలకమైన సమావేశానికి చాలా మంది నేతలు హాజరు కాలేదంటే.. ఎన్నికల పట్ల వారు ఎంత సీరియ్‌సగా ఉన్నారో అర్థం అవుతోందంటూ వేణుగోపాల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా జరిగిందంటూ టీపీసీసీ సంస్థాగత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ను ప్రశ్నించారు. సమావేశం గురించి ఆలస్యంగా సమాచారం అందడంతో అందరూ పాల్గొనలేకపోయారంటూ మహే్‌షకుమార్‌గౌడ్‌ వివరణ ఇచ్చారు.


దీనిపై తనకు నివేదిక ఇవ్వాలంటూ కేసీ వేణుగోపాల్‌ ఆయనకు సూచించారు. కొంత మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు కూడా ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకుని పనిచేయట్లేదంటూ వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రచారం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన నియోజకవర్గంలోనే ఉండి.. పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌ గెలుపై దృష్టి పెట్టాలని సూచించారు. అయితే తన సిటింగ్‌ సీటు భువనగరితో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ తదితర నియోజకవర్గాలకూ సమయం కేటాయించాల్సి వస్తున్నందున సికింద్రాబాద్‌కు ఎక్కువగా సమయం కేటాయించలేకపోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు

Updated Date - May 08 , 2024 | 04:31 AM