Myanmar : ఆంగ్ సాన్ సూ చీ దోషి... ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష... : మయన్మార్ సైనిక కోర్టు

ABN , First Publish Date - 2022-12-30T16:00:55+05:30 IST

పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ చీ (Aung San Suu Kyi) అవినీతి కేసులో దోషి అని ఆ దేశ

Myanmar : ఆంగ్ సాన్ సూ చీ దోషి... ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష... : మయన్మార్ సైనిక కోర్టు

బ్యాంకాక్ : పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూ చీ (Aung San Suu Kyi) అవినీతి కేసులో దోషి అని ఆ దేశ సైనిక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఆమెకు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆమెపై విచారణ జరిగిన అనేక క్రిమినల్ కేసుల్లో ఇది చివరిది. ఆమె ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, 2021 ఫిబ్రవరిలో ఆమె ప్రభుత్వాన్ని సైన్యం కూల్చివేసింది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పరిపాలన జరుగుతోంది.

సైనిక ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆమెపై రాజకీయ ప్రేరేపిత విచారణలు అనేకం జరిగాయి. కోర్టు తాజా తీర్పుతో ఆమె మొత్తం 33 సంవత్సరాలపాటు జైలు జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం విచారణ ముగిసిన అవినీతి కేసులో ఐదు నేరారోపణలు ఉన్నాయి. మరో ఏడు అవినీతి ఆరోపణల్లో అంతకుముందు ఆమె దోషి అని నిర్థరణ అయింది. ఒక్కొక్క ఆరోపణ దాదాపు 15 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించదగినది. అంతేకాకుండా చట్టవిరుద్ధంగా వాకీటాకీలను దిగుమతి చేసుకుని, తన స్వాధీనంలో ఉంచుకోవడం; కోవిడ్ ఆంక్షల ఉల్లంఘన, అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన, దేశద్రోహం, హెలికాప్టర్ కొనుగోలు, ఎన్నికల మోసాల కేసుల్లో కూడా ఆమె దోషి అని సైనిక కోర్టు నిర్థరించింది. గతంలో వచ్చిన తీర్పుల్లో ఆమెకు మొత్తం మీద 26 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శుక్రవారం మరో ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ శిక్షలన్నీ కలుపుకుని 33 సంవత్సరాలపాటు ఆమె జైలు జీవితం గడపవలసి ఉంటుంది.

సూ చీ స్టేట్ కౌన్సిలర్ పదవిని నిర్వహిస్తూ ప్రభుత్వాధినేతగా వ్యవహరించేవారు. ఆమె ప్రభుత్వంలో ప్రెసిడెంట్‌ పదవిని నిర్వహించిన విన్ మ్యింట్ ఈ కేసులో సహ నిందితుడు. ఇద్దరికీ ఏడేళ్ళ చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. సైనిక కోర్టు వీరిపై కేసులను విచారించేటపుడు మీడియా, దౌత్యవేత్తలు, ప్రేక్షకులు హాజరయ్యేందుకు అవకాశం కల్పించలేదు. దీని గురించి మాట్లాడరాదని ఆమె తరపు న్యాయవాదులపై ఆంక్షలు విధించారు.

Updated Date - 2022-12-30T16:00:58+05:30 IST