Rohit Reddy: విచారణకు రోహిత్‌రెడ్డి డుమ్మా... ఈడీ సీరియస్

ABN , First Publish Date - 2022-12-27T17:59:25+05:30 IST

ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (Rohit Reddy) హాజరుకాలేదు. విచారణకు రోహిత్‌రెడ్డి గైర్హాజరుపై ఈడీ అధికారులు (ED officials) సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Rohit Reddy: విచారణకు రోహిత్‌రెడ్డి డుమ్మా... ఈడీ సీరియస్

హైదరాబాద్: ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (Rohit Reddy) హాజరుకాలేదు. విచారణకు రోహిత్‌రెడ్డి గైర్హాజరుపై ఈడీ అధికారులు (ED officials) సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్‌రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఈడీ భావిస్తోంది. రోహిత్‌రెడ్డి గైర్హాజరుతో తదుపరి చర్యలకు ఈడీ సిద్దమవుతోంది. వ్యక్తిగతంగా విచారణకు సహకరిస్తానంటూనే రోహిత్‌రెడ్డి డుమ్మా కొట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తనను ఈడీ వేధిస్తోందని హైకోర్టు (High Court)లో రోహిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈడీ తనను వేధిస్తోందని రోహిత్‌రెడ్డి పిటిషన్‌ (Petition)లో పేర్కొన్నారు. ఈ రోజు ఈడీ విచారణకు రోహిత్‌రెడ్డి హాజరుకాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నట్లున్నారు. విచారణకు హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు మెయిల్ పంపారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో విచారణకు రోహిత్ హాజరుకాలేదు. రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను గురువారం విచారించనున్నారు. దీంతో హైకోర్టు తీర్పు తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

మరోవైపు మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితుడు నందకుమార్‌‌ను చంచల్‌గూడ జైలుకు ఈడీ అధికారులు విచారించారు. రెండో రోజు నందకుమార్ స్టేట్మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసు, రోహిత్‌రెడ్డితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోమవారం 12.10 గంటలకు చంచల్‌గూడ జైలుకు చేరుకుంది. గంట పాటు భోజన విరామాన్ని మినహాయించి.. నాలుగు గంటల పాటు నందును పలు కోణాల్లో ప్రశ్నించారు. ముఖ్యంగా.. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్ల డీలింగ్‌ ఎవరు చేస్తారు? ఆ డబ్బు ఇచ్చేదెవరు? ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఎలా పరిచయం? సెవెన్‌ హిల్స్‌ మాణిక్‌చంద్‌ యజమాని అభిషేక్‌తో లావాదేవీలపై ప్రశ్నలు సంధించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-12-27T17:59:27+05:30 IST