మున్సిపల్ స్థలాల ఆక్రమణలను అరికట్టాలి
ABN , First Publish Date - 2023-11-29T00:26:26+05:30 IST
మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పరరక్షించాలని టీడీపీ కౌన్సిలరు పవనకుమార్ గౌడు పేర్కొన్నారు.
గుంతకల్లు, నవంబరు28: మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పరరక్షించాలని టీడీపీ కౌన్సిలరు పవనకుమార్ గౌడు పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం ఉదయం మాసాంతపు సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. కమిషనరు మల్లికార్జున ఆధ్వర్యంలో చైర్పర్సన భవానీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో టీడీపీ నాయకులు పలు సమస్యలను లేవనెత్తారు. పవనకుమార్ గౌడు మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురౌతున్నాయంటూ పలుమార్లు కౌన్సిల్ సమావేశానికి విన్నవించామన్నారు. స్థలాలను ఆక్రమించినవారు అమ్మకానికి పెట్టి సొమ్ముచేసుకుంటున్నారని, కొన్నవారు డబ్బును నష్టపోతున్నారన్నారు. స్థలాలకు కంచెవేయడమేకాకుండా, హెచ్చరిక బోర్డులను నాటాలని సూచించా రు. కౌన్సిలరు కృపాకర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు వేతనాలను సక్రమంగా అందేలా చూడాలని కోరారు. పట్టణంలో కుక్కల బెడద తప్పించా లని పలువురు కౌన్సిలర్లు కోరారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలరు అనురాధ, గుడిపాటి ఆంజనేయులు, మహమ్మద్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.