విద్యార్థులతో వైసీపీ ర్యాలీ
ABN , First Publish Date - 2023-11-29T00:24:42+05:30 IST
వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పడని తంటాలు లేవనే చెప్పాలి. ఉచితానుచితాలు మరచిపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డీజేలతో చిందులు
గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం
ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
అనంతపురం ప్రెస్క్లబ్ 28: వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు పడని తంటాలు లేవనే చెప్పాలి. ఉచితానుచితాలు మరచిపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో మంగళవారం ‘మళ్లీ జగనన్నే సీఎం కావాలి’ అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. టవర్క్లాక్ నుంచి చేపట్టిన ఈ ర్యాలీలో కాలేజీ విద్యార్థులను భాగస్వాముల్ని చేశారు. డీజేలు, చిందులతో ప్రధాన సర్కిళ్లల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. దారినపోతున్న వారందరికి ఆ డీజే సౌండ్, అల్లర్లు, చిందులు విసుగుపుట్టించాయనే చెప్పాలి. గంటకుపైగా సాగిన ఈ ర్యాలీ కారణంగా టవర్క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. దీంతో పోలీసులు వారిని ఏమీ అనలేక, ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేక నానా ఇబ్బందులు పడ్డారు.