YSRCP: చెల్లుబోయిన వర్సెస్ పిల్లి.. వైసీపీలో డిష్యుం డిష్యుం

ABN , First Publish Date - 2023-07-16T17:37:29+05:30 IST

కోనసీమ జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కుమారుడికి ఇప్పించేలా ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తుండగా.. తన సీటు వదులుకునేందుకు మంత్రి వేణుగోపాలకృష్ణ సుముఖంగా కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రామచంద్రపురంలో తనకు వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని మంత్రి వేణు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

YSRCP: చెల్లుబోయిన వర్సెస్ పిల్లి.. వైసీపీలో డిష్యుం డిష్యుం

కోనసీమ జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కుమారుడికి ఇప్పించేలా ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తుండగా.. తన సీటు వదులుకునేందుకు మంత్రి వేణుగోపాలకృష్ణ సుముఖంగా కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మంత్రి వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకు టిక్కెట్ ఇవ్వరాదని.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి వేణు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

Collage Maker-16-Jul-2023-05-29-PM-8642.jpg

అయితే రామచంద్రపురంలో ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో నెలకొన్న అనిశ్చితిపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. రామచంద్రపురంలో తనకు వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. అసమ్మతి నేతల ఆరోపణలను హారాలుగా మలుచుకుంటానని.. అసమ్మతి నేతల సమావేశం ఎందుకు జరిగిందో ప్రజలకు, సీఎం జగన్‌కు తెలుసు అని మంత్రి వేణుగోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. అయినా సీట్లు ఇచ్చేది జగన్ అని.. ఓట్లు వేసేది ప్రజలు అని ఆయన తెలిపారు. శెట్టి బలిజ సామాజిక వర్గంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అని.. ఆయన్ను వ్యతిరేకించే శక్తి ఎవరికీ లేదన్నారు. ఎంపీ బోస్ అవలంభించిన మార్గాన్ని తాను పూర్తిగా అధ్యయనం చేశానని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.

అధిష్టానంపై అలక

కాగా వైసీపీ అధిష్టానంపై రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలక వహించారంటూ ఇటీవల తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. 2012లో మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట పిల్లి సుభాష్ నడిచారు. కానీ అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. తరువాత రెండు ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. ప్రస్తుతం చేతిలో రాజ్యసభ పదవి ఉన్నా ఎందుకీ పనికి రాకుండాపోయిందని బోస్ అంతర్గతంగా రగిలిపోతున్నారు. వైసీపీ హైకమాండ్ సైతం తన గోడు పట్టించుకోకపోవడంతో రగిలిపోతున్నారు.

మరోవైపు వైసీపీలో తమ వారిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టార్గెట్ చేస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ వర్గం ఆరోపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాష్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని, రామచంద్రపురం వైసీపీ అభ్యర్థిగా పలు గ్రామాల్లో సూర్యప్రకాష్ పర్యటిస్తారని పిల్లి సుభాష్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. నియోజక వర్గంలో నెలకొన్న పరిస్థితుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పిల్లి సుభాష్ అనుచరులు ఏర్పాటు చేసిన సమావేశం స్థానికంగా వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. అటు ఎంపీ పిల్లి సుభాష్‌కు మంత్రి చెల్లుబోయిన వేణు శిష్యుడు అని.. వాళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోనసీమ జిల్లాలో పిల్లి వర్సెస్ చెల్లుబోయిన వర్గాల రాజకీయాలు వైసీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

AP Politics : వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు.. ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

YSRCP: వైసీపీలో ముసలం.. విశాఖలో బలహీనపడుతున్న పార్టీ

Updated Date - 2023-07-16T17:38:50+05:30 IST