Kodi Pandelu: అరెరె.. పాపం.. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తుంటే ఎంత పని జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-01-15T19:55:40+05:30 IST

సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) నిర్వహించిన కోడి పందాలు (Kodi Pandelu) విషాదానికి దారితీశాయి. కోడి పందాల కారణంగా..

Kodi Pandelu: అరెరె.. పాపం.. తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తుంటే ఎంత పని జరిగిందంటే..

కిర్లంపూడి: సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) నిర్వహించిన కోడి పందాలు (Kodi Pandelu) విషాదానికి దారితీశాయి. కోడి పందాల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలి కావడం శోచనీయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కిర్లంపూడి మండలం వేలంకలో కోడికత్తి (Kodi Kathi) తగిలి గండే ప్రకాష్(45) అనే వ్యక్తి చనిపోయాడు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడికత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. అప్పటిదాకా పండుగ సందడితో కళకళలాడిన ఆ రెండు గ్రామాలు ఈ ఘటనలతో శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఇదిలా ఉండగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కాకినాడ రూరల్‌ మండలంలో (Kakinada Rural Mandal) యథేచ్ఛగా కోడి పందేలు జరిగాయి. సాంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహిస్తే కఠినంగా శిక్షిస్తాం, బైండోవర్‌ కేసుల నమోదు, కోళ్ల కత్తుల స్వాధీనం వంటి హెచ్చరికలు పోలీసులు చేసినా వాటిని నిర్వాహకులు ఏమాత్రం భేఖాతరు చేయలేదు. కాకినాడ రూరల్‌ మండల పరిధిలో నేమాం, తిమ్మాపురం, పండూరు, వలసపాకల, సర్పవరం, కొత్తూరు, కొవ్వాడ, తూరంగితో పాటూ అర్భన్‌ పరిధిలో గొడారిగుంటలో కోడిపందేలు నిర్వహించారు. వలసపాకల, తిమ్మాపురం, సర్పవరం తదితర చోట్ల భారీస్థాయిలో కోడిపందేలు జరిగాయి.

వలసపాకల్లో కార్పొరేట్‌ హంగులతో ఈదఫా కోడిపందేలను కోనసీమ జిల్లాకు చెందిన ఐ. పోలవరం మండలం కొమరగిరికి చెందిన రెండు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కోడిపందేలు నిర్వహించారు. ఇక్కడ మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఎక్కువ పోటీలు నెగ్గిన వాళ్లకు సుమారు రూ. 22 లక్షల విలువచేసే ఖరీదైన కారును బహుమతిగా ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వలసపాకల, తిమ్మాపురంలలో జరిగే పందేలు తిలకించేందుకు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు తరలిరావడం విశేషం. ఒక్కో బరిలో ఒక పందేనికి రూ. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పందేలు సాగాయి. ఒక్కరోజులోనే మండల పరిధిలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి.

Updated Date - 2023-01-15T19:56:03+05:30 IST