Chadalawada Arvind Babu: ఆ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే బాలకోటిరెడ్డి హత్య...

ABN , First Publish Date - 2023-02-22T11:35:43+05:30 IST

ప్రత్యర్థుల తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి (72) చికిత్స పొందుతూ గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాలలో మంగళవారం రాత్రి మృతి చెందారు.

Chadalawada Arvind Babu: ఆ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే బాలకోటిరెడ్డి హత్య...

పల్నాడు జిల్లా: ప్రత్యర్థుల తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ (TDP) పల్నాడు జిల్లా (Palnadu Dist.) రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి (72) (Venna Bala Kotireddy) చికిత్స పొందుతూ గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాలలో మంగళవారం రాత్రి మృతి చెందారు. బుధవారం గుంటూరు జీజీహెచ్‌ (GGH)లో కోటి రెడ్డి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ (Post Mortem) జరగనుంది. ఈ సాయంత్రం స్వగ్రామం ఆలవాలలో కోటి రెడ్డి భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. బాలకోటిరెడ్డికి నివాళ్లు అర్పించేదుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రానున్నారు. ఈ నేపథ్యంలో బాలకోటిరెడ్డి స్వగ్రామం ఆలవాలలో భారీగా పోలీసులు మొహరించారు.

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు (Chadalawada Arvind Babu) మార్చురీ వద్దకు చేరుకున్నారు. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు (TDP Leaders) కొల్లి బ్రహ్మయ్య, పులిమి రామిరెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ బాలకోటిరెడ్డిపై గతంలో ఒక సారి హత్య ప్రయత్నం జరిగిందన్నారు. రక్షణ కల్పించాలని కలెక్టర్, ఎస్పీని కోరామన్నారు. ఎస్పీ నిర్లక్ష్యం వల్లే కోటి రెడ్డి హత్య జరిగిందని విమర్శించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రోద్బలంతోనే కోటిరెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు.

రొంపిచెర్ల మండలంలో బాలకోటిరెడ్డి బలమైన నేతగా ఉన్నారని, ఆయన అడ్డు తొలగించుకోవాలనే ఎమ్మెల్యే హత్య చేయించారని అరవింద్ బాబు అన్నారు. పోలీసులతో టీడీపీ నేతల అడ్డు తొలగించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోక తప్పదని చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు.

పూర్తి వివరాలు...

ఈ నెల 2వ తేదీన ప్రత్యర్థులు బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపారు. గాయపడిన ఆయనకు నరసరావుపేటలో చికిత్స అందించారు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించటంతో గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ బాలకోటిరెడ్డి మృతి చెందారు. పలువురు టీడీపీ నాయకులు బాలకోటిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనపై దాడి జరిగిన రోజు నుంచి గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు. బాల కోటిరెడ్డి గతంలో రొంపిచర్ల ఎంపీపీగా, ఆయన భార్య గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. ఆరు నెలల కిందట ఆయనపై గ్రామానికి చెందినవారే గొడ్డలితో దాడి చేశారు. ఆ గాయాల నుంచి కోలుకుని, మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అలవాల గ్రామానికి చెందిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి కాల్పులకు సూత్రధారి. ఈ కేసులో పూజల రాములు, పులి అంజిరెడ్డి, వంటిపులి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.

Updated Date - 2023-02-22T15:51:26+05:30 IST