Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2023-07-02T16:06:41+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. .

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి.. ఏం జరుగుతుందో..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించాడు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ ఎంవీ కృష్ణారెడ్డి (MV Krishna Reddy) పిటీషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కృష్ణారెడ్డి పిటీషన్‌పై దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్ధిక స్థోమత తనకు లేనందున న్యాయవాదిని కల్పించాలని దస్తగిరి సుప్రీంకోర్టును కోరాడు. దీనిపై రేపు అనగా సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

1dastagiri.jpg

సీబీఐ ఏం తేల్చిందంటే..!

మరోవైపు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిందని సీబీఐ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారని.. తర్వాత సాక్ష్యాల ధ్వంసంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పాల్గొన్నట్లు తెలిపింది. అవినాశ్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేరుస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే అరెస్టయిన ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఏ7గా, ఆయన సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఏ6గా పేర్కొంది. వాస్తవానికి ఈ వివరాలను ఇదివరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే తెలియజేసింది. చార్జిషీటులో పేర్కొనడం మాత్రం ఇదే ప్రథమం. ఇందులో ఏ9 పేరును సైతం చేర్చే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరిగినా.. చార్జిషీటులో దర్యాప్తు సంస్థ దానిని ప్రస్తావించలేదు.

CBI.jpg

కుట్రలో భాగమే ఇదంతా..!

ఈ కేసులో డీఫ్యాక్టో ఫిర్యాదుదారుగా ఉన్న వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని, వివేకా ఇంట్లో వంట మనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాశ్‌ను అనుమానితులుగా చేర్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హత్యకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి డబ్బులిస్తారని.. సాక్ష్యాలేవీ లేకుండా చూసుకుంటారని.. మనకు భయం లేదని గంగిరెడ్డి భరోసా ఇచ్చినట్లు దస్తగిరి తన అప్రూవర్‌ స్టేట్‌మెంట్‌లో తెలిపినట్లు సీబీఐ వెల్లడించింది. ‘డబ్బు ఇవ్వడంతోపాటు హత్య తర్వాత కేసు పెట్టకుండా ప్రయత్నాలు చేయడం.. రక్తాన్ని కడిగేయడం, గాయాలు కనిపించకుండా బ్యాండేజీలు వేసి పూలతో అలంకరించడం వంటివన్నీ కుట్రలో భాగంగానే జరిగాయి’ అని తెలిపింది. నిందితుల పాత్రను నిరూపించేలా కాల్‌ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, గూగుల్‌ టేకౌట్‌, వివేకా ఇంటిలోని వైఫైకి సంబంధించిన సమాచారం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలు, నిపుణుల అభిప్రాయాలు సహా భారీ డేటాను సమీకరించినట్లు వెల్లడించింది.

ఇంకా చాలా ఉంది..!

జూన్‌ 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి విధించిన గడువు ముగిసిపోయింది. ఆ నేపథ్యంలోనే ముగ్గురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే దర్యాప్తు ఇంకా ముగిసిపోలేదని స్పష్టమవుతోంది. వివేకా హత్యలో.. కొత్తగా పేర్కొన్న అనుమానితుల పాత్ర ఏమిటన్నదని సీబీఐ తేల్చాల్సి ఉంది. అలాగే వివేకా రాసిన లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు ఢిల్లీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ చేపడుతున్న నిన్‌హైడ్రిన్‌ టెస్ట్‌ వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే వివేకా హత్య గురించి సీఎం జగన్‌కు బాహ్య ప్రపంచం కంటే ముందే తెలుసన్న అంశంపై స్పష్టతతోపాటు సీఎంకు ఎవరు చెప్పారనే సంక్లిష్ట అంశాలు ఇంకా తేలాల్సి ఉంది.

Updated Date - 2023-07-02T16:17:48+05:30 IST