వైసీపీ పాలనలో 4,709 పాఠశాలల మూత
ABN , First Publish Date - 2023-11-29T00:49:23+05:30 IST
వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో 2,045 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 2,664 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 4,709 పాఠశాలలు మూతపడ్డాయని ఎస్ఎఫ్ఐ గన్నవరం డివిజన్ కార్యదర్శి సీహెచ్ రాజేశ్ ఆరోపించారు.
![వైసీపీ పాలనలో 4,709 పాఠశాలల మూత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఉంగుటూరు, నవంబరు 28 : వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో 2,045 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 2,664 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 4,709 పాఠశాలలు మూతపడ్డాయని ఎస్ఎఫ్ఐ గన్నవరం డివిజన్ కార్యదర్శి సీహెచ్ రాజేశ్ ఆరోపించారు. మండలంలోని నాగవరప్పాడులో ఆయన మాట్లాడుతూ, పెత్తందార్లకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమని, తాను పేదల పక్షమని, చెప్పుకుంటున్న సీఎం జగన్ విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల వల్ల పేదవర్గాల పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని, పేదల బడులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయటం వల్ల 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందన్నారు. దీంతో పిల్లలు లేరనే కారణం చూపుతూ ప్రభుత్వం ఈ ఏడాది 111 ప్రాథమిక పాఠశాలలను మూసివేసిందని, జీవో 117తో సర్కారు బడుల్లో ఉపాధ్యాయులను తగ్గించి పిల్లలను బడికి దూరం చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి, విద్యారంగ పరిరక్షణతోపాటు, విద్యావ్యవస్థ బలోపేతానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాజేశ్ కోరారు.