Share News

భూ రీసర్వేలో మాయాజాలం

ABN , First Publish Date - 2023-11-28T23:43:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వే అటు అధికారులను, ఇటు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

భూ రీసర్వేలో మాయాజాలం

ఎకరాల్లో తేడా వచ్చిందని రైతుల ఆగ్రహం

పెద్దహుల్తిలో పంచాయతీ కార్యాలయానికి తాళం

పత్తికొండ టౌన్‌, నవంబరు 28: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వే అటు అధికారులను, ఇటు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. భూముల రీసర్వేలో ఎకరాలకు ఎకరాలు తేడాలు కనిపిస్తున్నాయి. అధికారుల తీరుతోనే తమ భూములు తమకు కాకుండా పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పత్తికొండ మండలంలోని పెద్దహుల్తి గ్రామ పంచాయితీలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భూ రీసర్వేలో ఎకరాలకు ఎకరాలే తక్కువగా ఎలా వచ్చాయంటూ ఆరోపిస్తూ రైతులు మంగళవారం గ్రామ పంచాయితీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. పెద్దహుల్తి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం జగనన్న భూరిసర్వే కింద రైతుల భూములన్నింటినీ సర్వే చేశారు. అందులో ఎకరాలకు ఎకరాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌ ప్రకారంగా సాగులో ఉంటున్న పలువురు రైతులకు చెందిన భూములు ఎకరాలకు ఎకరాలే తక్కువగా ఉన్నట్లు అధికారులు పంపిన నోటీసులతో బట్టబయలైంది. దీంతో స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో నోటీసులు జారీ చేసిన రెవెన్యూ అధికారుల వద్దకు పెద్ద ఎత్తున గ్రామానికి చెందిన రైతులు ఆందోళనలతో అక్కడకు చేరుకున్నారు. అక్కడున్న రెవెన్యూ, సర్వే అధికారులను రైతులు చుట్టుముట్టి తమ భూములు తక్కువగా ఉన్నట్లు ఎలా నోటీసులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మాయాజాలం వల్లే భూముల్లో తేడాలు వచ్చినట్లు మండిపడ్డారు. అధికారులను కార్యాలయంలోనే ఉంచి పంచాయితీ కార్యాలయానికి తాళం వేశారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ లక్ష్మీకాంతరెడ్డి గ్రామానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు.

Updated Date - 2023-11-28T23:43:13+05:30 IST