కంభం వైద్యశాలకు అంబులెన్స్ కరువు
ABN , First Publish Date - 2023-11-29T01:23:46+05:30 IST
కంభం ప్రభుత్వ వైద్యశాల 30 పడకల నుంచి 50 పడకల వైద్యశాలగా రూపాంతరం చెంది రెండే ళ్లు అయ్యింది.
కంభం, నవంబరు 28 : కంభం ప్రభుత్వ వైద్యశాల 30 పడకల నుంచి 50 పడకల వైద్యశాలగా రూపాంతరం చెంది రెండే ళ్లు అయ్యింది. అయినా, నేటికీ కొత్త అంబులెన్స్ను ఏర్పాటు చేయలేదు. దీంతో కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల ప్రజలు కొత్త అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక్కడి అంబులెన్స్ 10 సంవత్సరాల కిందట ప్రమాదానికి గురై మూలన పడింది. నాటి నుంచి ఇక్కడ అంబులెన్స్ లేదు. ప్రమాదం జరిగిన చోటు నుంచి క్షతగాత్రులను కంభం వైద్యశాల నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు, గుంటూరు, కర్నూలు పట్టణాలకు తరలించడానికి బాధితులు వ్యయప్రయాసలు ఎదుర్కోవలసి వస్తోందని, ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తనిఖీలకు వచ్చిన జిల్లా అధికారులు నూతన అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్కు కూడా విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కంభం వైద్యశాలకు నూతన అంబులెన్స్ను సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.