Share News

‘రైతుబంధు’కు మంగళం!

ABN , First Publish Date - 2023-11-29T00:09:50+05:30 IST

రైతుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులతో పంట నష్టాలు తప్పడం లేదు. పెట్టుబడి వ్యయం పెరిగిపోవడంతో సాగు భారమవుతోంది. ఆశించిన స్థాయి దిగుబడులు రాక రైతులకు కన్నీరే మిగులుతోంది.

‘రైతుబంధు’కు మంగళం!
పాతపట్నం మార్కెట్‌ కమిటీ కార్యాలయం

- అన్నదాతలకు అందని రుణాలు

- నిర్వహణలేని వైద్య శిబిరాలు

(మెళియాపుట్టి)

మెళియాపుట్టి మండలం దీనబందుపురం పంచాయతీ కుడ్డబ గ్రామానికి చెందిన లుగలాపు భాస్కరరావు అనే రైతుకు సుమారు ఐదు ఎకరాలు భూమి ఉంది. గతంలో ఏటా వంద బస్తాలకుపైగా ధాన్యం దిగుబడి వచ్చేది. టీడీపీ హయాంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ధాన్యం నిల్వ చేసి రుణం తీసుకునేవాడు. ఽధర పెరిగిన సమయంలో ధాన్యాన్ని విక్రయించి లాభం పొందేవాడు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదని భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం లేక.. నష్టపోతున్నామని వాపోతున్నాడు.

................

రైతుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులతో పంట నష్టాలు తప్పడం లేదు. పెట్టుబడి వ్యయం పెరిగిపోవడంతో సాగు భారమవుతోంది. ఆశించిన స్థాయి దిగుబడులు రాక రైతులకు కన్నీరే మిగులుతోంది. అన్నదాతలను ఆదుకోవాల్సిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లు వారికి ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు పశుసంపద రవాణాపై మార్కెట్‌ రుసుం వసూలు చేస్తున్నారు. కానీ, రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కోసం అమలు చేయడం లేదు. వడ్డీ లేని రుణాలు రైతులకు అందజేయడం లేదు. మరోవైపు నిధుల కొరత కారణంగా పశువైద్య శిబిరాలు కూడా చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి..ః

జిల్లాలో 12 మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటితో పాటు 11 ప్రధాన మార్కెట్‌ కమిటీలు, ఆరు ఉప మార్కెట్‌ కమిటీలు నడుస్తున్నాయి. 1,47,500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం నిల్వ చేసుకునేలా 65 గోదాములు ఉన్నాయి. టీడీపీ హయాంలో రైతుబంధు పథకం ద్వారా మార్కెట్‌ కమిటీ గోదాముల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకునేవారు. నిల్వను బట్టి ఒక్కో రైతుకు రూ.2లక్షల వరకు రైతులకు రుణాలు అందజేసేవారు. ఆరు నెలల వరకు వడ్డీ భారం ఉండేది కాదు. ఆరు నెలలు దాటిన తర్వాత 270 రోజుల వరకు 12 శాతం వడ్డీ వసూలు చేసేవారు. డిమాండ్‌ పెరిగినప్పుడు ఆ ధాన్యాన్ని విక్రయించి రైతులు ఈ రుణాలు తీర్చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు రుణాల ఊసే లేదు. మార్కెట్‌ కమిటీలు కేవలం సెస్‌ వసూళ్లకే పరిమితమవుతున్నాయి. గతంలో ఏఎంసీ పరిధిలో పశు వైద్యశిబిరాల నిర్వహణకు బడ్జెట్‌ నిధులు కేటాయించేవారు. పశువులకు టీకాలు వేయించేవారు. ప్రస్తుతం రైతుభరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత కనీసస్థాయిలో శిబిరాలు నిర్వహించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుబంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు. దీనిపై పాతపట్నం మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రాజమోహన్‌ వద్ద ప్రస్తావించగా.. రైతులు పంటలను వ్యవసాయమార్కెట్‌ కమిటిలో నిల్వ చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. కానీ, రుణాలు ఇవ్వడం లేదన్నారు. నిల్వ చేసినందుకు రైతులు ప్రతి నెల బస్తాకు రూ.5 చొప్పున చెల్లించాలని తెలిపారు.

Updated Date - 2023-11-29T00:09:51+05:30 IST