రేషన్ ఏదీ?
ABN , First Publish Date - 2023-11-29T00:06:11+05:30 IST
పాతహిరమండలం దుర్గగుడి వీధికి చెందిన 60 కుటుంబాలకు ఈ నెల రేషన్ సరుకులు అందకలేదు. దీంతో రేషన్కార్డుదారులు వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
- ఈ నెల 60 కుటుంబాలకు అందని సరుకులు
- తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల నిరసన
హిరమండలం, నవంబరు 28 : పాతహిరమండలం దుర్గగుడి వీధికి చెందిన 60 కుటుంబాలకు ఈ నెల రేషన్ సరుకులు అందకలేదు. దీంతో రేషన్కార్డుదారులు వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం జడ్పీటీసీ పి.బుచ్చిబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ నెల బియ్యం, పంచదార పంపిణీ చేయలేదని, దీనిపై ఎండీయూ ఆపరేటర్ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ మురళీమోహనరావు.. ఎండీయూ ఆపరేటర్తో ఫోన్లో మాట్లాడి.. ఈ నెల రేషన్ సరుకులు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ఈ నెల 17 వరకు మాత్రమే సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని.. తర్వాత సర్వర్ నిలిచిపోయిందని ఆపరేటర్ తెలిపారు. దీంతో రేషన్ వెనక్కి పంపించేశామని, ఈ నెల కార్డుదారులకు సరుకులు ఇవ్వలేమని తేల్చిచెప్పాడు. దీంతో కార్డుదారులు లబోదిబోమన్నారు. సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయని ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.