Share News

ఈ స్థలం మాది.. కాదు మాది

ABN , First Publish Date - 2023-11-29T00:07:44+05:30 IST

వంశధార, వ్యవసాయశాఖ మధ్య స్థల వివాదంతో.. వైఎస్సార్‌ అగ్రీల్యాబ్‌ నిర్మాణ ప్రహరీ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

ఈ స్థలం మాది.. కాదు మాది
టెక్కలిలో వైఎస్‌ఆర్‌ అగ్రీ ల్యాబ్‌ వద్ద నిలిచిన ప్రహరీ పనులు

- వంశధార, వ్యవసాయశాఖల మధ్య వివాదం

- నిలిచిన ప్రహరీ నిర్మాణం

టెక్కలి, నవంబరు 28: వంశధార, వ్యవసాయశాఖ మధ్య స్థల వివాదంతో.. వైఎస్సార్‌ అగ్రీల్యాబ్‌ నిర్మాణ ప్రహరీ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. టెక్కలి-తెంబూరు రోడ్డు మార్గంలోని సర్వేనెం.490-5ఏ లో 19సెంట్ల స్థలాన్ని కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అఽధికారులు 2020అక్టోబరు 20న వ్యవసాయశాఖకు అప్పగించారు. ఆ స్థలంలో వైఎస్సార్‌ అగ్రీల్యాబ్‌ నిర్మించి.. ఈ ఏడాది జూలై 8న సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ భవనానికి సంబంధించి ప్రహరీ నిర్మాణానికి సుమారు రూ.12లక్షలు నాబార్డు నిధులతో పోలీస్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ టెండర్లు పిలిచింది. ఈ మేరకు మంగళవారం కాంట్రాక్టర్‌ ప్రహరీ నిర్మాణం చేపడుతుండగా.. ఈ స్థలం తమదంటూ వంశధార అధికారులు అడ్డుకున్నారు. దీంతో స్థల వ్యవహారమై రెండుశాఖల అధికారుల వద్ద కాంట్రాక్టర్‌ వేర్వేరుగా పంచాయితీ పెట్టారు. ప్రహరీ నిర్మించాలని వ్యవసాయశాఖ అధికారులు.. నిర్మిస్తే ఊరుకునేదిలేదని వంశధార అధికారులు పట్టుపట్టడంతో పనులు నిలిచిపోయాయి.

- ఈ విషయమై వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్‌ వద్ద ప్రస్తావించగా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ మేరకు కేటాయించిన స్థలం వివరాలు నీటిపారుదల శాఖ ఎస్‌ఈకి సమర్పించామని తెలిపారు. పనులు అడ్డుకోవడం తగదన్నారు.

- ఇదే విషయమై వంశధార ఈఈ కొత్తకోట శ్రీకాంత్‌ వద్ద ప్రస్తావించగా ఇది పూర్తిగా వంశధారకు సంబంధించిన స్థలమని తెలిపారు. ఈ స్థలం వ్యవసాయశాఖకు కేటాయించినట్లు శాఖాపరమైన అనుమతులు వారి వద్ద లేవన్నారు. అందుకే వంశధార స్థలంలో ప్రహరీ నిర్మాణం అడ్డుకున్నామని తెలిపారు.

Updated Date - 2023-11-29T00:07:46+05:30 IST