Share News

నిల్వ చికెన్‌, చద్ది బిర్యానీ

ABN , First Publish Date - 2023-11-29T01:12:52+05:30 IST

హోటళ్లలో నాణ్యత లేని, నిల్వ ఉంచిన ఆహారం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం రెండు హోటళ్లలో సోదాలు నిర్వహించారు.

నిల్వ చికెన్‌, చద్ది బిర్యానీ

హేలాపురి, జీషాన్‌ హోటళ్లలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

విస్మయకరమైన విషయాలు బట్టబయలు

మిగిలిపోయినవి వేడి చేసి కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నట్టు గుర్తింపు

పరీక్షల నిమిత్తం నమూనాల సేకరణ

వంట గదులు శుభ్రంగా లేనందుకు రూ.10 వేలు, రూ.15వేలు చొప్పున జరిమానా

విశాఖపట్నం, కొమ్మాది, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

రోజుల తరబడి నిల్వ చేసిన చికెన్‌...ముందురోజు మిగిలిపోయిన బిర్యానీ...పరిశుభ్రత లేకపోవడంతో కంపుకొడుతున్న వంట గది...ఇవీ జగదాంబ జంక్షన్‌లోని హేలాపురి, మధురవాడలోని జీషాన్‌ హోటల్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు. హోటళ్లలో నాణ్యత లేని, నిల్వ ఉంచిన ఆహారం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం రెండు హోటళ్లలో సోదాలు నిర్వహించారు. అదనపు ఎస్పీ జి.స్వరూపారాణి ఆధ్వర్యంలో సీఐ లక్ష్మోజి, తదితరులు జగదాంబ జంక్షన్‌లోని హేలాపురి రెస్టారెంట్‌లో తనిఖీ చేశారు. హోటల్‌లో ప్లాస్టిక్‌ కవర్లతో నిల్వ ఉంచిన చికెన్‌ లాలీపాప్‌, చికెన్‌ ఫ్రై కర్రీ, లివర్‌లను అధికారులు గుర్తించారు. చికెన్‌ లాలీపాప్‌లు రోజుల తరబడి నిల్వ ఉన్నవిగా అధికారులు అభిప్రాయపడగా, బిర్యానీ ముందురోజు మిగిలిపోయినదిగా గుర్తించారు. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడే వంటగదిలో బిర్యానీ, చికెన్‌ లాలీపాప్‌లను వేడి చేస్తున్నారు. వంట గదిని పరిశీలించేందుకు వెళ్లిన అధికారులు అక్కడి పరిస్థితులను చూసి ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోటల్‌కు వచ్చిన కస్టమర్లు ఫుడ్‌ ఆర్డర్‌ చేయగానే ప్లాస్టిక్‌ కవర్లలో నిల్వ చేసిన పదార్థాలను తీసి అప్పటికప్పుడు వేడి చేసి సర్వ్‌ చేస్తున్నట్టు అదనపు ఎస్పీ స్వరూపారాణి తెలిపారు. హోటల్‌పై కేసు నమోదుచేసి శాంపిళ్లను సేకరించి ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులకు పంపిస్తున్నామన్నారు. వంటగదిలో పరిశుభ్రత పాటించకపోవడంపై రూ.10 వేలు జరిమానా విధించారు.

అలాగే మధురవాడలోని జీషాన్‌ హోటల్‌లో మిగిలిపోయిన బిర్యానీ అమ్ముతున్నారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు అందినట్టు తెలిసింది. దీంతో సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల బృందం ఆ హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించింది. కల్మీకబాబ్‌, బిర్యానీ నిల్వ ఉన్నట్టు గుర్తించి వాటి శాంపిళ్లను సేకరించడంతోపాటు వంట గదిలో పరిశుభ్రత లేకపోవడంపై రూ.15 వేలు జరిమానా విధించారు. రెండు హోటళ్లపైనా కేసు నమోదు చేశామని, శాంపిళ్లను ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని విక్రయిస్తున్నట్టు నిర్ధారణ అయితే ఆయా హోటళ్లపై తదుపరి చర్యలు ఉంటాయని అదనపు ఎస్పీ స్వరూపరాణి తెలిపారు.

Updated Date - 2023-11-29T01:12:53+05:30 IST