Share News

గల్లంతైన రాజేశ్‌ మృతి

ABN , First Publish Date - 2023-11-29T00:51:17+05:30 IST

పరవాడ, అచ్యుతాపురం మండలాల సరిహద్దు తంతడి బీచ్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన జంగాల రాజేశ్‌(14) మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు.

గల్లంతైన రాజేశ్‌ మృతి
జంగాల రాజేశ్‌ (ఫైల్‌ ఫొటో)

రెండు రోజుల తరువాత తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం

అచ్యుతాపురం/ పరవాడ, నవంబరు 28: పరవాడ, అచ్యుతాపురం మండలాల సరిహద్దు తంతడి బీచ్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన జంగాల రాజేశ్‌(14) మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఇతని మృతదేహం అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద తీరానికి కొట్టుకువచ్చింది. పరవాడ బీసీ కాలనీకి చెందిన రాజేశ్‌, తన స్నేహితులతో కలిసి తంతడి బీచ్‌లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన అలలు ధాటికి గల్లంతైన సంగతి తెలిసిందే. సోమవారం నేవీ హెలికాప్టర్‌తోపాటు కోస్టుగార్డు పడవలతో తంతడి, ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం, పూడిమడక, రాంబిల్లి ప్రాంతాల్లో సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో పూడిమడక జగన్నాథస్వామి ఆలయం వెనుక తీరం వద్దకు ఒడ్డుకు రాజేశ్‌ మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పరవాడ ఎస్‌ఐ మల్లీశ్వరరావు చెప్పారు.

Updated Date - 2023-11-29T00:51:19+05:30 IST