సోదరికి ఇంటిపనుల సాయంకోసం వచ్చి..

ABN , First Publish Date - 2023-02-16T23:57:36+05:30 IST

తన సోదరి నిర్మించుకుంటున్న ఇంటి పనుల్లో సాయం చేసేందుకు వచ్చిన తమ్ముడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన మండలంలోని కొట్టాంలో చోటుచే సుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు...

సోదరికి ఇంటిపనుల సాయంకోసం వచ్చి..
వెంకటరావు (ఫైల్‌):

శృంగరపుకోట రూరల్‌: తన సోదరి నిర్మించుకుంటున్న ఇంటి పనుల్లో సాయం చేసేందుకు వచ్చిన తమ్ముడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన మండలంలోని కొట్టాంలో చోటుచే సుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... కొట్టాం గ్రామానికి చెందిన పిల్లా వెంకటరావు కొద్దేళ్ల కిందట ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో విశాఖపట్నం వెళ్లాడు. అక్కడ కూలి పనులు చేసుకొని తన ఇద్దరు కుమారులు, భార్యను పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల తన అక్క ఇంటి పనుల్లో సాయంచేయాలని కోరడంతో బుధవారం రాత్రి గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం ఇంటి పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇంటికి ఏర్పాటుచేసిన మోటారును పరీక్షించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు.వెంటనే స్థానికులు ట్రాక్టర్‌లో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. తన అక్క ఇంటి నిర్మాణంలో సాయం చేసేందుకు వచ్చిన వెంకటరావు మృతిచెంద డంతో కొట్టాంలో విషాదం నెలకొంది.తన భర్త మరణం తెలుసుకున్న భార్య రోదన చూ పరులను కంటతడిపెట్టించింది.ఈమేరకు ఎస్‌ఐ తారకేశ్వరరావు కేసు నమోదుచేశారు.

Updated Date - 2023-02-16T23:57:43+05:30 IST