వారిపై కేసుల తొలగింపు
ABN , First Publish Date - 2023-11-29T00:13:48+05:30 IST
పది లీటర్లలోపు మద్యంతో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీసులకు తొలిసారి పట్టుబడిన నిందితులపై కేసులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎస్.వెంకటరావు చెప్పారు.
![వారిపై కేసుల తొలగింపు](https://media.andhrajyothy.com/media/2023/20231102/28vzp5_612d8696b7.gif)
వారిపై కేసుల తొలగింపు
మద్యంతో తొలిసారి పట్టుబడిన వారికి మినహాయింపు
సెబ్ అదనపు ఎస్పీ వెంకటరావు
విజయనగరం క్రైం, నవంబరు 28: పది లీటర్లలోపు మద్యంతో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీసులకు తొలిసారి పట్టుబడిన నిందితులపై కేసులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎస్.వెంకటరావు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సెబ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెబ్ రాష్ట్ర కమిషనర్ రవిప్రకాష్ ఆదేశాలతో జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో 2020 మే 16 నుంచి 2023 ఆగస్టు 29 మధ్య కాలవ్యవధిలో నమోదైన తొలిసారి నేరానికి పాల్పడిన వ్యక్తులకే ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ తరహా కేసుల్లో ఇప్పటికే 693 కేసులను తొలగించామని, మరో 1,047 కేసులు దర్యాప్తు దశలోనూ, న్యాయస్థానాల విచారణలో వున్నట్టు గుర్తించామన్నారు. ఈ నిందితులందరికీ నోటీసులు జారీ చేసి కాంపౌండింగ్ ఫీజు చెల్లించినట్లయితే కేసులు తొలగిస్తామన్నారు. నిందితులు జరిమానా చెల్లించినప్పటికీ నేరం చేసినట్టుగా పరిగణించడం జరగదన్నారు. సారా తయారీ, రవాణాపై సెబ్ సమర్థంగా పనిచేస్తుందన్నారు. సారా, గంజాయి, మద్యం, డ్రగ్స్ నియంత్రణకు టోల్ ఫ్రీ నెంబరు 14500కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో సెబ్ టౌన్ సీఐ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.