Share News

Delhi Brutal: ఢిల్లీలో దారుణం.. బిర్యానీ కోసం హత్య.. 60 సార్లు పొడిచి.. ఆపై డ్యాన్స్ చేస్తూ..

ABN , First Publish Date - 2023-11-23T10:38:40+05:30 IST

ఈ రోజుల్లో మనుషుల్లో.. ముఖ్యంగా యువకుల్లో నేరస్వభావం పెచ్చుమీరిపోతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. కేవలం రూ.350 కోసం..

Delhi Brutal: ఢిల్లీలో దారుణం.. బిర్యానీ కోసం హత్య.. 60 సార్లు పొడిచి.. ఆపై డ్యాన్స్ చేస్తూ..

Delhi Crime News: ఈ రోజుల్లో మనుషుల్లో.. ముఖ్యంగా యువకుల్లో నేరస్వభావం పెచ్చుమీరిపోతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. బిర్యాని తినాలని కేవలం రూ.350 కోసం ఒక 16 ఏళ్లు కుర్రాడు 18 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 60 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఆపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం పొందాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని ‘వెల్‌కమ్’ ఏరియాలో చోటు చేసుకున్న ఈ హత్య వెనుక దోపిడీనే కారణమని తెలుస్తోంది. 18 ఏళ్ల యువకుడు ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. అతనిపై 16 ఏళ్ల నిందితుడు ఒక్కసారిగా దాడి చేశాడు. ఆ టీనేజ్ అబ్బాయి ప్రతిఘటించడంతో.. నిందితుడు వెంటనే తన దగ్గరున్న కత్తి తీసుకొని పొడవడం మొదలుపెట్టాడు. వెనువెంటనే కత్తిపోట్లు పొడవడంతో.. ఆ అబ్బాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఒక ఇరుకైన సందులో అతడ్ని ఈడ్చుకొని వెళ్లడం సీసీటీవీ కెమెరాలో బంధింపబడింది. అతడు చనిపోయేంతవరకు మెడపై కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయాడా? లేదా? అని నిర్ధారించుకోవడం కోసం కొన్నిసార్లు తలని కూడా తన్నాడు. చివరికి.. ఆ 18 ఏళ్ల టీనేజ్ అబ్బాయి చనిపోయాడని తెలిసి, నిందితుడు మృతదేహం పక్కనే డ్యాన్స్ చేశాడు.

తమకు మంగళవారం రాత్రి 11:15 సమయంలో ఈ హత్య గురించి సమాచారం అందిందని, వెల్కమ్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ తెలిపారు. 18 ఏళ్ల యువకుడ్ని దోచుకునే క్రమంలో.. 16 ఏళ్ల అబ్బాయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. బాధితుడ్ని అప్పటికప్పుడే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయిందని, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. సీసీటీవీ ఆధారంగా తాము వెంటనే నిందితుడ్ని పట్టుకొని అరెస్టు చేశామన్నారు. అతడ్ని విచారించగా.. బిర్యానీ తినడం కోసం మృతుడి వద్ద నుంచి రూ.350 దొంగలించినట్టు చెప్పాడన్నారు. నిందితుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-11-23T15:06:30+05:30 IST