Share News

Anju Returned India: పాక్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చేసిన అంజూ.. మళ్లీ పెద్ద ప్లానే వేసిందిగా.. భర్త, పిల్లల విషయంలో..!

ABN , First Publish Date - 2023-11-30T09:59:50+05:30 IST

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి.. ఎవరికీ చెప్పా పెట్టకుండా పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన అంజూ.. మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చేసింది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలవడానికే వెళ్లానంటూ మొదట్లో చెప్పిన అంజూ.. ఆ తర్వాత అతడినే పాక్‌లో పెళ్లి చేసుకుంది కూడా. ఆమె వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

Anju Returned India: పాక్‌ నుంచి భారత్‌కు తిరిగొచ్చేసిన అంజూ.. మళ్లీ పెద్ద ప్లానే వేసిందిగా.. భర్త, పిల్లల విషయంలో..!

న్యూఢిల్లీ: భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి.. ఎవరికీ చెప్పా పెట్టకుండా పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన అంజూ.. మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చేసింది. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను కలవడానికే వెళ్లానంటూ మొదట్లో చెప్పిన అంజూ.. ఆ తర్వాత అతడినే పాక్‌లో పెళ్లి చేసుకుంది కూడా. ఈ ఏడాది జూలై నెలలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆమె వ్యవహారం.. మళ్లీ మరోసారి తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రి భారత్‌కు తిరిగొచ్చిన ఆమె.. ఏమేం పనుల మీద ఇక్కడకు వచ్చిందన్నది కూడా వెల్లడించింది.

రాజస్థాన్‌లోని భీవాడీ జిల్లాకు చెందిన అరవింద్ అనే వ్యక్తితో అంజూకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది. ఆమెకు 15 ఏళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సోషల్ మీడియా యాప్స్‌ను ఉపయోగించే అంజూకు ఫేస్‌బుక్‌లో పాకిస్తాన్‌కు చెందిన నస్రుల్లాతో పరిచయం అయింది. 2019వ సంవత్సరం నుంచి అతడితో ఆమె చాటింగ్ చేస్తూ ఉంది. మెసేజ్‌లతో మొదలయిన వ్యవహారం ఫోన్ కాల్స్ దాకా చేరి.. చివరకు ప్రేమాయణానికి దారి తీసింది. ఉన్నట్టుండి సడన్‌గా ఈ ఏడాది జూలై నెల 27వ తారీఖున భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. జైపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానంటూ భర్తకు చెప్పింది కానీ.. చివరకు ఆమె పాకిస్తాన్‌లోని ప్రియుడి వద్దకు చేరిందన్న సంగతి సోషల్ మీడియా ద్వారానే భర్తకు తెలిసింది.

తాను కేవలం స్నేహితుడిని కలిసేందుకు మాత్రమే వచ్చాననీ.. మళ్లీ వెనక్కు వెళ్లిపోతానని మొదట్లో అంజూ చెప్పినప్పటికీ.. అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఫేస్‌బుక్ ఫ్రెండ్ నస్రుల్లానే ఆమె పెళ్లి చేసుకుంది. తన పేరును ఫాతిమాగా కూడా మార్చుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో వీరిద్దరి ప్రేమపెళ్లికి బహుమతిగా అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారి మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమిని, డబ్బును కూడా ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఆమె ఇక తిరిగి రాదు అని నిశ్చయింంచుకున్న భర్త అరవింద్.. పిల్లల భవిష్యత్తు కోసం రోజూ కూలి పనులకు వెళ్తూనే ఉన్నాడు.

అయితే జూలై నెలలో పాక్‌కు వెళ్లిన అంజూ.. నాలుగు నెలల తర్వాత మళ్లీ భారత్‌కు తిరిగొచ్చింది. పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్లోకి ఆమె బుధవారం రాత్రి ప్రవేశించింది. అయితే వాఘా బోర్డర్ వద్ద దర్యాప్తు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ క్యాంప్ వద్ద ఆమెను విచారించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను అమృత్ సర్ విమానాశ్రయానికి తీసుకెళ్లిన అధికారులు.. విమానంలో ఢిల్లీకి తరలించారు. పాకిస్తాన్‌కు అసలు ఎందుకు వెళ్లింది.? అక్కడ ఏం జరిగింది..? మళ్లీ భారత్‌కు తిరిగి రావడం వెనుక అసలు కారణాలు ఏంటన్నదాని గురించి అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

కాగా.. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన అంజూ.. తాను భారత్‌కు ఎందుకు తిరిగొచ్చానన్నది వెల్లడించింది. ‘నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం. నా కొడుకు, కూతురు లేకుండా ఉండలేకపోతున్నాను. అక్కడ నాకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ పిల్లలు పదే పదే గుర్తుకు వస్తున్నారు. వారిని నా వద్దకు తీసుకెళ్లాలని తిరిగి వచ్చాను. నా పిల్లలను నా వెంట తీసుకెళ్తాను. అదే సమయంలో నా భర్తకు కూడా విడాకులు ఇస్తాను. చట్టపరంగా చేయాల్సిన పనులను చేయడానికే భారత్‌కు తిరిగి వచ్చాను..’ అంటూ అంజూ తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన భర్త అరవింద్.. ఆమె అసలు తిరిగి వస్తున్న సంగతే తనకు తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె గురించి మాట్లాడేందుకే తనకు మనస్కరించడం లేదనీ.. ఆమె పేరును తన వద్ద ప్రస్తావించవద్దని ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-11-30T10:01:18+05:30 IST