Share News

Mizoram Election 2023: ఎంఎన్ఎఫ్‌కు 25 నుంచి 35 సీట్లు ఖాయం: జోరంతంగా

ABN , First Publish Date - 2023-10-15T16:00:10+05:30 IST

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.

Mizoram Election 2023: ఎంఎన్ఎఫ్‌కు 25 నుంచి 35 సీట్లు ఖాయం: జోరంతంగా

ఐజ్యాల్: మిజోరాం (Mizoram) అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (Mizo National Front) తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా (Zoramthanga) ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తమ పార్టీ ఊడ్చేసిన రీతిలోనే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ చతికిలపడుతుందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోరంతంగా జోస్యం చెప్పారు.


''అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో మేము చాలా బిజీగా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. మా పార్టీ 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాను. కాంగ్రెస్‌‌కు ఒకటి రెండు సీట్లు వచ్చినా అది లక్కీనే. అది కూడా రాకపోవచ్చు. బీజేపీకి సైతం రెండు సీట్లు వస్తే రావచ్చు. అది కూడా రాకపోయే అవకాశం ఉంది. ఎన్నికల్లో మాకు జోరం పీపుల్స్ మూమెంట్ (జేపీఎం) ప్రధాన ప్రత్యర్థి. ఆ పార్టీ 10 సీట్లు గెలుచుకుంటే లక్కీనే. ఆ ప్రకారం చూసినప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి'' అని జోరంతంగా తెలిపారు. కోవిడ్ సమయంలో కూడా మిజోరం అభివృద్ధికి తమ ప్రభుత్వం పాటుపడిందని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నామని, దురదృష్టవశాత్తూ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికపరమైన ఆటుపోట్లు తలెత్తాయని, ఈ సమయంలో కూడా తాము శక్తివంచన లేకుండా రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు.


వరుసగా రెండోసారి..

కాగా, 2023 ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని ఎంఎన్‌ఎఫ్ పట్టుదలగా ఉంది. మిజో శాంతి ఒప్పందంపై అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సంతకం చేసిన తర్వాత 1987లో మిజోరం రాష్ట్రం ఏర్పడింది. అప్పట్నించి మూడు సార్లు ఎంఎన్ఎఫ్ అధికారం చేపట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 5 సీట్లు, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. జేపీఎం 8 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - 2023-10-15T16:00:33+05:30 IST