G-20 Dinner: సీఎం నవీన్ పట్నాయక్ డుమ్మా..!

ABN , First Publish Date - 2023-09-09T18:35:09+05:30 IST

జి-20 సదస్సు ప్రారంభం సందర్భంగా అతిథుల గౌరవార్ధం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు ఇస్తున్న విందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఆయన గైర్హాజరు వెనుక ఇతమిద్ధమైన కారణాన్ని తెలియజేయలేదు.

G-20 Dinner: సీఎం నవీన్ పట్నాయక్ డుమ్మా..!

భువనేశ్వర్: జి-20 సదస్సు (G-20 Summit) ప్రారంభం సందర్భంగా అతిథుల గౌరవార్ధం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు ఇస్తున్న విందుకు (Dinner) ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఆయన గైర్హాజరు వెనుక ఇతమిద్ధమైన కారణాన్ని తెలియజేయలేదు. రాష్ట్రపతి విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబినెట్, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులందరికీ ఆహ్వానాలను పంపారు.


రాష్ట్రపతి విందు కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఇప్పటికే ధ్రువీకరించారు. అయితే, కాంగ్రెస్ పాలిత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ముందస్తు కార్యక్రమాల రీత్యా తాను విందు కార్యక్రమానికి హాజరుకావడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక సమాచారం ఇవ్వగా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లు తమ హాజరును ఇంకా ధ్రువీకరించలేదు. ఆరోగ్య కారణాలరీత్యా విందుకు హాజరుకాలేమంటూ కేంద్రానికి తెలియజేసిన వారిలో మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సహా రాజకీయ నేతలకు ఆహ్వానం పంపలేదు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్, భారత్ మండపంలో ఈ విందు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-09-09T18:35:09+05:30 IST