తెలంగాణ ప్రకటనల్లో ఓట్లు అడగలేదు
ABN , First Publish Date - 2023-11-28T23:48:40+05:30 IST
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు నెలల సాధన, అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల గురించి తెలంగాణ మీడియాకు ప్రకటనలు ఇవ్వడాన్ని
![తెలంగాణ ప్రకటనల్లో ఓట్లు అడగలేదు](https://media.andhrajyothy.com/media/2023/20231102/siddaramaiah_30d4965b53.jpg)
ఎన్నికల నియమాలను ఉల్లంఘించలేదు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టీకరణ
బెంగళూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు నెలల సాధన, అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల గురించి తెలంగాణ మీడియాకు ప్రకటనలు ఇవ్వడాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య గట్టిగా సమర్థించుకున్నారు. బెంగళూరులో మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఎక్కడా ఓట్లను అభ్యర్థించలేదని, ఎన్నికల నియమాల ఉల్లంఘన ఎక్కడా జరగలేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిని సంజాయిషీ కోరుతూ లేఖ రాసిందని, దీనికి వివరణ ఇస్తామని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, సహజంగానే ఇది ప్రధాని మోదీ, బీజేపీ నేతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోందన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సమరం హామీలకు కట్టుబడిన కాంగ్రెస్కు, మాట తప్పిన బీజేపీకి మధ్య కొనసాగుతోందన్నారు. బీజేపీ అబద్ధపు ప్రచారాలపై కాంగ్రెస్ నిజాలు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణ అంతటా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోందన్నారు.