Telangana Elections: 2009లోనూ ఇదే తీరు.. ఇప్పుడూ మళ్లీ ఇదే రచ్చ..!

ABN , First Publish Date - 2023-09-08T19:30:28+05:30 IST

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందిన జాన్సన్ నాయక్‌పై దుమారం మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడా తెగకు చెందిన వాడు కాదని ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చేసింది ఎవరో కాదు స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Telangana Elections: 2009లోనూ ఇదే తీరు.. ఇప్పుడూ మళ్లీ ఇదే రచ్చ..!

నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల సందర్భంగా కుల వివాదం అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ గండంగా మారుతోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు కావడంతో అన్ని పార్టీలు లంబాడా తెగకు చెందిన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంటాయి. పలుసార్లు ఆదివాసీలకు కూడా కొన్ని పార్టీలు టికెట్లు ఇచ్చాయి. అయితే ఆదివాసీల అభ్యర్థిత్వాలపై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకున్నప్పటికీ లంబాడా తెగకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు మాత్రం వారి కుల వ్యవహారం రాజకీయ వివాదాలకు కారణమవుతుందంటున్నారు. చాలాసార్లు ఇక్కడ అధికార పార్టీ నుంచి పోటీ చేసే లంబాడా తెగకు చెందిన నేతల విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడం అలాగే కోర్టులను ఆశ్రయించడం, కోర్టులు కూడా ఈ అంశంపై వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అయితే మళ్లీ ఈసారి అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందిన జాన్సన్ నాయక్‌పై కూడా ఇలాంటి దుమారమే మొదలైంది. జాన్సన్ నాయక్ లంబాడా తెగకు చెందిన వాడు కాదని ఆయన తాత, ముత్తాతలు, తల్లిదండ్రులు క్రైస్తవ మతంలో కొనసాగుతున్నారంటూ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చేసింది ఎవరో కాదు స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈసారి బీఆర్‌ఎస్ అధిష్ఠానం టికెట్‌ను రేఖానాయక్‌కు కాకుండా కొత్త వ్యక్తి అయిన కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. టికెట్ జాన్సన్ నాయక్‌కు ఇచ్చిన నాటి నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ తీవ్ర ఆవేదనకు లోను కావడమే కాకుండా జాన్సన్ నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ముఖ్యంగా కుల ప్రస్తావన కీలకంగా మారింది. జాన్సన్ నాయక్ పేరులోనే క్రైస్తవ మతం ఉందంటూ ఆమె ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.


జాన్సన్ నాయక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగానే తాను ఎన్నికల సంఘానికి, అలాగే ఉన్నతాధికారులకు ఆయన కులం విషయంలో ఫిర్యాదులు చేస్తానంటూ ఎమ్మెల్యే రేఖానాయక్ బహిరంగంగా ప్రకటిస్తుండటంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం మొదలైంది. మూడు రోజుల నుంచి ఖానాపూర్ నియోజకవర్గంలోనే ఉంటూ రేఖానాయక్ తన అభిమానులు, సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల ప్రత్యర్థుల కన్నా బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ పొందిన జాన్సన్ నాయక్‌నే లక్ష్యంగా చేసుకుని ఇక ఎదురుదాడి కొనసాగించాలని రేఖా నాయక్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ కేటాయించనప్పటికీ తాను మాత్రం రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసేది మాత్రం కొద్దిరోజుల్లోనే చెబుతానంటూ ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమె భర్త శ్యాం నాయక్ మాత్రం ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. రేఖానాయక్ కూడా ఖానాపూర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆమె మాత్రం ఈ అంశంపై స్పష్టతనివ్వకుండా దాటవేస్తున్నారు. జాన్సన్ నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె పోటీలో ఉండబోతున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

2009లోనూ ఇదే తీరు..

2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖానాపూర్ సెగ్మెంట్‌లో అప్పటి అధికార టీడీపీ అభ్యర్థి సుమన్ రాథోడ్ కులం విషయం రాజకీయ దుమారానికి కారణమైంది. సుమన్ రాథోడ్ విజయం సాధించినప్పటికీ ఆమె ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హరినాయక్ కులం విషయంలో అటు ఎన్నికల సంఘానికి ఇటు కోర్టుకు ఫిర్యాదులు చేశారు. సుమన్ రాథోడ్ మహారాష్ట్రలోని కన్వర్ట్‌కు చెందదిన వారని అక్కడ లంబాడా సామాజిక తెగ ఓబీసీ పరిధిలో ఉంటారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మ్యారేజ్ అడాప్షన్ మైగ్రేషన్ విషయంలో మాత్రం తల్లిదండ్రుల కులమే పిల్లలకు వర్తిస్తుందన్న అంశాన్ని అప్పట్లో హరినాయక్ కోర్టులో లేవనెత్తారు. సుమన్ రాథోడ్ తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో ఆమె కులం కూడా ఓబీసీ పరిధిలోకి వస్తుందని ఎస్టీ కులం ఆమెకు వర్తించందంటూ హరినాయక్ వాదించారు.

ఈ విషయంలో హైకోర్టు కూడా సుమన్ రాథోడ్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అనంతరం సుమన్ రాథోడ్ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. కులం వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కులం విషయంలో కూడా కొంత చర్చ జరిగింది. రేఖానాయక్ కర్ణాటకకు చెందిన వారని అక్కడ ఆమె కులం కూడా ఓబీసీ పరిధిలోకి వస్తుందని ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఆమె ఆరోపణలను తిప్పికొట్టి తాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్లుగా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం పొందిన జాన్సన్ నాయక్ విషయంలో మాత్రం రేఖానాయక్ స్పష్టంగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులకు సిద్ధమవుతుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-09-08T19:30:31+05:30 IST