Scissors stuck in head: షాకింగ్.. బాలిక తలలో దిగబడ్డ కత్తెర.. ఆపరేషన్‌కు డబ్బుల్లేక..

ABN , First Publish Date - 2023-07-11T20:50:03+05:30 IST

ఫిలిపీన్స్ దేశంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక తలలో కత్తెర దిగబడింది. ఆ చిన్నారి ఏకంగా వారం రోజుల పాటు తన తలలో ఇరుక్కుపోయిన కత్తెరతో అవస్థ పడాల్సి వచ్చింది. వైద్యుల కృష్టికి అదృష్టం తోడవడంతో ఆమె సమస్య నుంచి సులువగా బయటపడింది.

Scissors stuck in head: షాకింగ్.. బాలిక తలలో దిగబడ్డ కత్తెర.. ఆపరేషన్‌కు డబ్బుల్లేక..

ఇంటర్నెట్ డెస్క్: ఫిలిపీన్స్ దేశంలో(Philippines) తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ల బాలికపై ఆమె తమ్ముడు దాడి చేయడంతో ఆమె తలలో కత్తెర దిగబడింది(Scissors stuck in girls head). ఏకంగా వారం రోజుల పాటు ఆ చిన్నారి తలలో ఇరుక్కుపోయిన కత్తెరతో అవస్థ పడాల్సి వచ్చింది. వైద్యుల కృష్టికి అదృష్టం తోడవడంతో ఆమె సమస్య నుంచి సులువగా బయటపడింది. సరంగానీ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొన్ని రోజుల క్రితం నికోల్ రాగా అనే తొమ్మిదేళ్ల బాలిక తన తమ్ముడి(5)తో పెన్సిల్ విషయమై గొడవ పడింది. ఈ క్రమంలో అతడు తన బ్యాగుతో అక్క తలపై కొట్టాడు. దీంతో, అతడి బ్యాగులోని కత్తెర బాలిక తలలో దిగబడిపోయింది.

ఆ రోజు ఇంటికొచ్చిన తండ్రి, తన కూతురి తలలో కత్తెర దిగబడిందని గుర్తించి కంగారు పడిపోయాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే, కత్తెర బయటకు తీసేందుకు ఆపరేషన్ అవసరమని, ఇందుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. విషయం తెలిసి స్థానికులు బాలికను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. అయితే, ఆపరేషన్‌కు కావాల్సిన మొత్తాన్ని సేకరించేందుకు ఏకంగా వారం రోజులు పట్టడంతో వైద్యుల పర్యవేక్షణలో బాలిక ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. తలలో ఇరుక్కుపోయిన కత్తెరతో చిన్నారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కాగా, అంతా అనుకున్నట్టు జరగడంతో వైద్యులు బాలికకు జూలై 9న ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి కత్తెరను తీసేశారు. దీంతో, బాలిక తండ్రి రెనే బాయ్ రాగా ఆనందానికి అంతేలేకుండా పోయింది.

‘‘ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మేము చాలా బీదవాళ్లం. నాకు తొలుత అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో పాలుపోలేదు. కానీ, ఎంతో మంది నన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. నా కూతురు పూర్తి స్థాయిలో కోలుకుంటుందని వైద్యులు చెప్పారు. ఆమె మెదడుకు ఎటువంటి దెబ్బ తగలలేదని అన్నారు. కత్తెర తాలూకు గాయం పూర్తిగా నయమవుతుందని భరోసా ఇచ్చారు’’ అంటూ సంబరపడిపోతూ చెప్పారు. ఇకపై పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. పిల్లలకు పదునైన వస్తువులు ఇవ్వొద్దంటూ ప్రజలకూ ఆయన సూచించారు.

Updated Date - 2023-07-11T20:50:06+05:30 IST