Share News

ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా

ABN , First Publish Date - 2023-11-22T00:11:44+05:30 IST

జన బలమే తప్ప.. ధన బలం లేని పేదింటి కూలి బిడ్డనైన తనను ఆదరించి గెలిపించి అసెంబ్లీకి పంపితే సేవకుడిగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు.

ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
ఆమనగల్లు : సభలో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి

ఆమనగల్లు, నవంబరు 21: జన బలమే తప్ప.. ధన బలం లేని పేదింటి కూలి బిడ్డనైన తనను ఆదరించి గెలిపించి అసెంబ్లీకి పంపితే సేవకుడిగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. మూడున్నర దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు, ఉద్యమాలు సాగిస్తున్న తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను వేడుకున్నారు. ఆమనగల్లు, కల్వకుర్తి, తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ, కడ్తాల మండలాల పరిధిలో మంగళవారం ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ తిరిగి బీజేపీని ఆదరించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తలకొండపల్లి మండలం చెన్నారం, యెడవల్లి, చుక్కాపూర్‌, చీపునుంతల, వెంకటాపూర్‌ తండా, పెద్దూర్‌, పకడల్‌, లింగరావుపల్లిలో ఆచారి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. కల్వకుర్తి మండలం మొకురాలలో ఎన్నికల ప్రచారంలో దశాబ్దాల కాలం బీజేపీకి పనిచేసి మృతి చెందిన తిరుపతి రెడ్డిని స్మరిస్తూ ఆచారి తీవ్ర భావోద్వేగానికి లోనై బోరున విలపించారు. రవిగౌడ్‌, పద్మ అనిల్‌, రాజుగౌడ్‌, బక్కికుమార్‌, తదితరులున్నారు. కడ్తాల మండలం మైసిగండిలో సీనియర్‌ నాయకుడు రాందాస్‌నాయక్‌ ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో మండలాధ్యక్షుడు మన్యనాయక్‌, మాజీఎంపీపీ వీరయ్య, జిల్లా నాయకులు మోహన్‌రెడ్డి, రమేశ్‌, మమేశ్‌, శంకర్‌నాయక్‌, తదితరులు ప్రచారం చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు ప్రచారం చేశారు.

Updated Date - 2023-11-22T00:12:07+05:30 IST