Share News

BRS: అధికార పార్టీలో అసమ్మతి రాగం.. ఆ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‏ పరిస్థితి...

ABN , First Publish Date - 2023-11-10T07:35:27+05:30 IST

గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‏కు అసమ్మతి బెడద తగ్గలేదు. నామినేషన్ల దాఖలు

BRS: అధికార పార్టీలో అసమ్మతి రాగం.. ఆ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‏ పరిస్థితి...

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్‏కు అసమ్మతి బెడద తగ్గలేదు. నామినేషన్ల దాఖలు తుది అంకానికి చేరుకున్న దశలో మరోసారి అసంతృప్తులు ధిక్కార స్వరాలు వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అంబర్‌పేట, ముషీరాబాద్‌(Amberpet, Mushirabad) నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నేతలు దూరంగా ఉన్నారు. వారిలో కొందరు పార్టీని వీడగా.. ఇంకొందరు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గంలో గురువారం జరిగిన కాలేరు వెంకటేష్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవీ రమేష్‌, పులి జగన్‌లు దూరంగా ఉన్నారు. తమకు ఆహ్వానం లేదని, పిలవకుండా ఎలా వెళ్తామని మాజీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. అసంతృప్త నేతలతో కొన్నాళ్ల క్రితం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశమై సర్దిచెప్పారు. దీంతో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. తమను కాలేరు కలుపుకొని వెళ్లడం లేదని, ప్రగతిభవన్‌ దాటగానే అక్కడ చెప్పిన మాటలు విస్మరించాడని మాజీలు ఆరోపిస్తున్నారు.

పార్టీ వీడతారా..?

గరిగంటి శ్రీదేవీరమేష్‌ తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీకి రాజీనామా చేసే విషయంపై చర్చించారు. అదే సమయంలో మరో మాజీ కార్పొరేటర్‌ పులి జగన్‌, సీనియర్‌ నాయకులు నాగేష్‌ గౌడ్‌లు అక్కడకు చేరుకున్నారు. అసంతృప్తు నేతల సమావేశం విషయం తెలుసుకున్న నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి మోహన్‌రావు వెంటనే రంగంలోకి దిగారు. ఒకరోజు వేచి చూడాలని అంతా సర్దుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా శ్రీదేవీరమేష్‌ వాయిదా వేసుకున్నారు. నాగేష్ గౌడ్‌ మాత్రం అదే సమావేశంలో బీఆర్‌ఎస్‏కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి అనంతరం కాంగ్రెస్‏లో చేరారు. మరో ఇద్దరు సీనియర్‌ నేతలు చిట్టెడి నర్సింహారెడ్డి, మురళీకృష్ణలు రేవంత్‌ సమక్షంలో హస్తం గూటికి చేరారు. కాలేరు సానుకూలంగా స్పందించని పక్షంలో పార్టీని వీడేందుకు మాజీ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ‘అగ్రనేతల మాటలకు కట్టుబడి పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాం. అభ్యర్థి నుంచి ఆ స్థాయిలో స్పందన లేదు. విలువ లేని చోట ఎందుకుంటాం’ అని వారు పేర్కొంటున్నారు. ముషీరాబాద్‌లోనూ సీనియర్‌ నేత ఎమ్మెన్‌ శ్రీనివాసరావు, బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సునీతాప్రకా్‌షగౌడ్‌ ముఠా గోపాల్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఆది నుంచి వీరు ప్రచారానికి దూరంగా ఉంటుండడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలనిస్తోంది.

Updated Date - 2023-11-10T07:35:28+05:30 IST