Bandi Sanjay : బండి సంజయ్ విడుదల.. జైలు నుంచి బయటకు రాగానే ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-04-07T09:08:58+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు.

Bandi Sanjay : బండి సంజయ్ విడుదల.. జైలు నుంచి బయటకు రాగానే ఏం చేశారంటే..

కరీంనగర్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు బయటకు వచ్చిన వెంటనే ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడారు. అయితే ప్రస్తుతం బండి సంజయ్ తన నివాసానికి వెళ్లి.. అనంతరం ఆయన హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జైలు దగ్గర భారీగా పోలీసు బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.

తీవ్ర ఉత్కంఠ.. సుదీర్ఘ, హోరాహోరీ వాదనల తర్వాత పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. రూ.20 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరి జమానతు సమర్పించాలని హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఇన్‌చార్జి న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు. దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. అంతకు ముందు బెయిల్‌, కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారందాదాపు ఎనిమిది గంటలపాటు హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి, రాత్రి పది గంటలకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో, సంజయ్‌ శుక్రవారమే కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను ఏ1 నిందితుడిగా నమోదు చేయడం; కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. పోలీసులు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై కోర్టులో గురువారం వాదనలు జరిగాయి.

పిటిషనర్‌ బండి సంజయ్‌ తరపున న్యాయవాదులు విద్యాసాగర్‌ రెడ్డి, చొల్లేటి రామకృష్ణ, వై.శ్యాంసుందర్‌ రెడ్డి, సంసాని సునీల్‌ వాదించారు. ప్రాసిక్యూషన్‌ తరపున రేవతి వాదించారు. న్యాయవాదులతో కోర్టు కిక్కిరిసిపోయింది. ఇరు వర్గాల మధ్య దాదాపు ఎనిమిది గంటలపాటు వాదనలు జరిగాయి. చివరికి, కస్టడీ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. దాంతో, సంజయ్‌కు బెయిల్‌ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. బండి సంజయ్‌కు బెయిల్‌ ఇస్తే కేసులో ఇప్పటికే సేకరించిన ఆధారాలను, సాక్షులను ప్రభావితం చేసి తారుమారు చేసే అవకాశం ఉందని, బెయిల్‌ ఇవ్వకూడదని పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రేవతి బెయిల్‌ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తే ఇలాంటి పేపర్‌ లీకేజీ ప్రచారంలాంటి సంఘటనలు జరుగుతాయని వాదించారు. తద్వారా, రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పరీక్షలు ఇంకా జరుగుతున్నాయని, లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని వాదించారు. పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌కు బెయిల్‌ ఇస్తే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయి చర్యలు చేపట్టే అవకాశం ఉందని, ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుందని చెప్పారు.

Updated Date - 2023-04-07T09:16:41+05:30 IST