Share News

ముగిసిన ప్రచారం.. హై అలర్ట్‌

ABN , First Publish Date - 2023-11-29T00:21:18+05:30 IST

శాసనసభకుఈ నెల 30న జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 48 గంటల పాటు మద్యం షాపులన్నీ మూసివేశారు. ఈ మేరకు కరీంనగర్‌ అర్బన్‌ ఎక్సైజ్‌ సీఐ నగరంలోని వైన్‌ షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీజ్‌ చేసి సీల్‌ వేశారు.

ముగిసిన ప్రచారం.. హై అలర్ట్‌
కరీంనగర్‌లో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను సీజ్‌ చేస్తున్న అర్బన్‌ ఎక్సైజ్‌ సీఐ తాతాజీ

- మద్యం దుకాణాల మూసివేత

- పోలీసు, ఎక్సైజ్‌ తనిఖీలు ఉధృతం

కరీంనగర్‌ క్రైం, నవంబరు 28: శాసనసభకుఈ నెల 30న జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 48 గంటల పాటు మద్యం షాపులన్నీ మూసివేశారు. ఈ మేరకు కరీంనగర్‌ అర్బన్‌ ఎక్సైజ్‌ సీఐ నగరంలోని వైన్‌ షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీజ్‌ చేసి సీల్‌ వేశారు. పోలింగ్‌ అనంతరం గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత తెరవనున్నారు. నగరంలోని 21 వైన్స్‌, 22 బార్లు, ఒక క్లబ్‌, ఒక మిలిటరీ క్యాంటీన్‌, మూడు కల్లు దుకాణాలను మూసివేసి సీజ్‌ చేశారు. ఎక్సైజ్‌ బృందాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ మద్యం అక్రమ అమ్మకాలు, రవాణాపై నిఘా పెట్టాయి. అక్రమ మద్యం అమ్మకాలపై సమాచారం తెలిసిన వారు వెంటనే అర్బన్‌ ఎక్సైజ్‌ సీఐ ఫోన్‌ నం. 8712658808కు సమాచారం అందించాలని ఎక్సైజ్‌ అర్బన్‌ సీఐ తాతాజీ కోరారు. పోలింగ్‌ దృష్ట్యా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే సీపీ కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురికి మించి వ్యక్తులు జమ కాకూడదని, సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అభిషేక్‌ మహంతి హెచ్చరించారు. 48 గంటల పాటు సైలెన్స్‌ పీరియడ్‌ ఉన్నందున రాజకీయ పార్టీల జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించవద్దని సూచించారు. మైకులు, లౌడ్‌ స్పీకర్లు, డ్రోన్ల వంటివి ఉపయోగించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. సైలెన్స్‌ పీరియడ్‌లో మద్యం, డబ్బు, ఇతర బహుమతుల పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మొబైల్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు పోలింగ్‌ స్టేషన్ల వారీగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల తనిఖీలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు కమిషనరేట్‌వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఇతర ప్రాంతాల నాయకులు కరీంనగర్‌ కమిషనరేట్‌ వదిలి వెళ్లాలని ఇప్పటికే ఆయా పార్టీలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లాడ్జీలు, హోటళ్లు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఎన్నికల బందోబస్తుకు ఆరు కంపెనీల కేంద్ర బలగాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్‌ పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి మూడు వేల వరకు పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:21:21+05:30 IST