హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలి : వీర్లపల్లి శంకర్
ABN , First Publish Date - 2023-11-29T00:05:03+05:30 IST
తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ షాద్నగర్ నియోజక వర్గ ప్రజలకు ఏం చేసిందని ఓట్లు అడుగుతోందని, ఈసారి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు.
షాద్నగర్ అర్బన్//కొత్తూర్/నందిగామ/చౌదరిగూడ, నవంబరు 28: తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ షాద్నగర్ నియోజక వర్గ ప్రజలకు ఏం చేసిందని ఓట్లు అడుగుతోందని, ఈసారి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార ముగింపును పురష్కరించుకుని మంగళవారం నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్, నందిగామ, కొత్తూర్, చౌదరిగూడ మండలాల్లో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్పరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ప్రచార సభల్లో వీర్లపల్లి మాట్లాడుతూ షాద్నగర్ నియోజక వర్గంలో స్వయాన కేసీఆర్ ప్రతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మించలేకపోయారని, మైనార్టీలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లను సాధించలేదని విమర్శించారు. నియోజకవర్గంలోని ఒక్క పేదోడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వలేదని, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇవ్వలేదని అన్నారు. ఐదేళ్ళు గడుస్తున్నా... నేటికీ రైతు రుణమాఫీ 35శాతం దాటలేదని తెలిపారు. నియోజక వర్గంలో పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టలేదని, నిరుదోగ్య యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముందే మద్యం టెండర్లను పూర్తిచేసిన కేసీఆర్.. రైతు రుణమాఫీ, రైతుబంధును ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని, ఆరు గ్యారంటీలతో పాటు షాద్నగర్కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుచేసి, విద్యవ్యవస్థను పటిష్టం చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్దే ఘన విజయం : బండ్ల గణేష్
తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందని కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. షాద్నగర్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో చౌలపల్లి ప్రతా్పరెడ్డితో కలిసి గణేష్ పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విసిగెత్తిన ప్రజలు మార్పుకోరుతున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పాలనను కోరుతున్నారని అన్నారు. వీర్లపల్లి శంకర్ ఘన విజయం సాధిస్తారని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్రెడ్డి సీఎం కాబోతున్నారని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. నాయకులు మామిడి శ్యాంసుందర్రెడ్డి, బాబర్, బాల్రాజ్గౌడ్, చెంది తిరుపతిరెడ్డి, తాండ్ర కాశీనాత్రెడ్డి, తాండ్ర శ్రవణ్రెడ్డి, జె. వేణుగోపాల్గౌడ్, జె. సుదర్శన్గౌడ్, ఏనుగు జనార్థన్రెడ్డి, జనిగే జగన్, కొంకళ్ళ చెన్నయ్య, పి. రఘు, జిల్లెల రాంరెడ్డి, జిల్లెల బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.