Share News

Amaravati : దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ భరోసా

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:20 AM

దివ్యాంగ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోయే స్థితి నుంచి గట్టెక్కిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో....

Amaravati : దివ్యాంగ విద్యార్థులకు లోకేశ్‌ భరోసా

  • 25 మందికి జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు

  • ఇంటర్‌లో సబ్జెక్టు ‘మినహాయింపు’తో ఇబ్బంది

  • సీట్లు కోల్పోయే పరిస్థితి నుంచి గట్టెక్కించిన మంత్రి

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): దివ్యాంగ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు కోల్పోయే స్థితి నుంచి గట్టెక్కిచింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో ఇంటర్‌ విద్యాశాఖ ఆగమేఘాలపై వారికి కొత్త మార్కుల మెమోలు జారీచేసి, వారి సీట్లు వారికి దక్కేలా చూసింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పోయినట్లేనని భావించిన విద్యార్థులకు సీట్లు దక్కాయి. వివరాలివీ.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో దివ్యాంగ కోటాలో 170 ర్యాంకు సాధించిన విజయవాడ విద్యార్థి పృథ్వీ సత్యదేవ్‌ చైన్నై ఐఐటీలో సీటు వస్తుందని భావించాడు.

జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) పెట్టిన కొత్త నిబంధనతో సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో భాషా సబ్జెక్టుల్లో ఒక దాంట్లో మినహాయింపు ఉంటుంది. అంటే తెలుగు లేదా ఇంగ్లీ్‌షలో ఒక సబ్జెక్టు రాయాల్సిన అవసరం లేదు. సెకండియర్‌లో మిగిలిన ఐదు సబ్జెక్టులకు ఆ విద్యార్థులకు మార్కుల మెమోలు ఇస్తారు. అయితే ఈ ఏడాది జోసా పెట్టిన కొత్త నిబంధన ప్రకారం ఇంటర్‌ సెకండియర్‌లో కనీసం ఐదు సబ్జెక్టులు ఉండాలి. మన విద్యార్థులకు కూడా ఐదు సబ్జెక్టులు ఉన్నప్పటీ గణితం సబ్జెక్టును ఎ, బి అంటూ రెండు వేర్వేరు పేపర్లుగా చూపిస్తారు. జోసా దానిని ఒక సబ్జెక్టుగానే పరిగణించడంతో దివ్యాంగ విద్యార్థులు నాలుగు సబ్జెక్టుల్లోనే మార్కులు సాధించినట్లైంది. ఇలా మొత్తం 25 మంది విద్యార్థులు సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను విద్యార్థులు తొలుత ఇంటర్‌ విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు.

ఆ వెంటనే మంత్రి లోకేశ్‌కు వాట్సాప్‌ ద్వారా వివరించారు. దానిపై తక్షణం స్పందించిన మంత్రి ఏం చేస్తే సీట్లు కోల్పోకుండా ఉంటారని అధికారులతో చర్చించారు. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు కనీస మార్కులు(పాస్‌ మార్కులు) వేద్దామని నిర్ణయించారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అయితే జోసా దీనిని కూడా అంగీకరించలేదు. దీనిపై ప్రభుత్వ జీవో ఉండాలని స్పష్టంచేసింది. మళ్లీ దీనిపై మంత్రి ఆదేశాలు జారీచేశారు. 1992లో ఇచ్చిన ఓ జీవో ఆధారంగా జీవో 255 తాజాగా విడుదల చేశారు. దాని ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సగటు మార్కులను మినహాయింపు పొందిన సబ్జెక్టుకు వేశారు. ఆ మేరకు కొత్త మార్కుల మెమోలు జారీచేశారు.

సెలవు దినాల్లోనూ అధికారులు దానిపైనే కూర్చుని మెమోలు తయారుచేయించి మరీ వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దీంతో కోల్పోయామని భావించిన సీట్లు ఆ విద్యార్థులకు దక్కాయి. ప్రభుత్వ చొరవతో సీట్లు పొందిన విద్యార్థులు మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులైనప్పటికీ జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన వారిని మంత్రి నేడు అభినందించనున్నారు. కాగా, వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యను ఎలా అధిగమించాలనేదానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.


కొండంత ఆత్మవిశ్వాసం

లోకేశ్‌ అన్న చేసిన సాయం మాలాంటి వారిలో కొండంత ఆత్మవిశ్వాసం నింపింది. ఆయన చొరవ వల్లే నా లక్ష్యాన్ని సాధించేందుకు మార్గం దొరికింది. ఐఐటీ గౌహతిలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతున్నా. ఇంజనీరింగ్‌ అనంతరం సివిల్స్‌ రాయాలనేది లక్ష్యం. నాకు చేసిన సాయానికి ఎలా ఽథాంక్స్‌ చెప్పాలో అర్థం కావట్లేదు.

- తేజిత చౌదరి, తిరుపతి

భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్నా

కౌన్సెలింగ్‌ అధికారులు కొర్రీ వేశాక ఇక మా భవిష్యత్తు ముగిసిపోయిందని భావించాం. నేనున్నాను అధైర్యపడొద్దని మంత్రి లోకేశ్‌ భరోసా ఇచ్చారు. నిరంతరం అధికారులతో మాట్లాడి జీవో విడుదల చేయించి మా భవిష్యత్తును కాపాడారు. ఎన్‌ఐటీ కాలికట్‌లో సీటు వచ్చింది. మంత్రి సాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.

-రఘునాథరెడ్డి, కడప.

లోకేశ్‌కు రుణపడి ఉంటా..

మంత్రి లోకేశ్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. మొదట్లో సీటుపై ఆశలు వదిలేసుకున్నాను. మంత్రి చొరవతో ఇప్పుడు ఐఐటీ ఖరగ్‌పుర్‌లో సీటు వచ్చింది. సివిల్‌ సర్వెంట్‌ కావాలన్నది నా లక్ష్యం. మా భవిష్యత్తుకు భరోసా కల్పించినందుకు ధన్యవాదాలు.

- రాణి, కాకినాడ.

Updated Date - Jul 08 , 2024 | 06:20 AM