Share News

AP News : ఉన్నదంతా దోచేసి, ఖాళీ ఖజానా ఇచ్చిన వైసీపీ!

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:38 AM

‘గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచేసి, ఖజానాను ఖాళీ చేసింది. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు’ అని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.

AP News : ఉన్నదంతా దోచేసి, ఖాళీ ఖజానా ఇచ్చిన వైసీపీ!

  • సంక్షేమం, అభివృద్ధిలో వెనుకడుగు వేయం: మంత్రి నారాయణ

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 8: ‘గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచేసి, ఖజానాను ఖాళీ చేసింది. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు’ అని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.

గురువారం ఒంగోలు విచ్చేసిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయాతో కలిసి కొప్పోలు రోడ్డులోని రాజీవ్‌ గృహకల్పలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, డ్రైన్లు లేకపోవడాన్ని పరిశీలించారు. వైసీపీ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులు, కేంద్రం మంజూరుచేసిన నిధులు సుమారు రూ.1,900 కోట్లు దోచేశారని, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు మరో వెయ్యి కోట్లు స్వాహా చేశారని నారాయణ ఆరోపించారు.

ఒంగోలులోని రాజీవ్‌ గృహకల్పలో రోడ్లు, డ్రైన్ల కోసం రూ.2.38 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పనులు వంద రోజుల్లో పూర్తిచేస్తామని, ఆ తర్వాత ఎన్టీఆర్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఇతర శివారు కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.

Updated Date - Aug 09 , 2024 | 03:39 AM