Share News

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..

ABN , Publish Date - Jul 24 , 2024 | 06:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు.

Ashwini Vaishnaw: ఏపీ, తెలంగాణ రైల్వే బడ్జెట్ వివరాలు ఇవే..
Union Minister Ashwini Vaishnaw

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌-2024లో రూ.9,151కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వేల కోసం కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆయన వెల్లడించారు. ఏపీలో 100శాతం రైళ్లు విద్యుదీకరించామని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే రూ.73,743కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భాగంగా 73స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీలో ఇప్పటికే 743 ఫ్లై ఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు.


అమరావతి రైల్వే లైన్‌కు అనుమతి..

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం గతంలో కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత నిర్మాణం ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణనది మీదుగా రూ.2,047కోట్లతో 56కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్ కోసం నీతి అయోగ్ అనుమతి ఇచ్చిందని, ప్రాజెక్టు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి ముంబైకు వందే భారత్ సాధ్యం కాదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.


తెలంగాణకు రైల్వే శాఖ కేటాయింపులు..

తెలంగాణ రైల్వేకు రికార్డుస్థాయిలో రూ.5,336కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6రెట్లు అధికం అని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.32,946కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయని, అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వేస్టేషన్లు ఆధునికీకరించామని అన్నారు. తెలంగాణలోనూ 100శాతం విద్యుదీకరణ పూర్తయ్యిందని చెప్పుకొచ్చారు. గడిచిన 10ఏళ్లలో 437ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో రూ.1.9లక్షల కోట్లతో రైల్వే సేఫ్టీ కోసం కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60శాతం తగ్గాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.

Updated Date - Jul 24 , 2024 | 06:21 PM