Share News

వైసీపీ పరాజయంతో.. జగన్‌కు పాస్‌పోర్టు కష్టాలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:14 AM

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్నోయిన వైసీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి.

వైసీపీ పరాజయంతో.. జగన్‌కు పాస్‌పోర్టు కష్టాలు

  • సాధారణ పాస్‌పోర్టు రెన్యువల్‌కు సీబీఐ కోర్టు అనుమతి

  • ఐదేళ్లకు ఇవ్వాలని ఆదేశించినా..ఏడాదే ఇచ్చిన విజయవాడ ప్రత్యేక కోర్టు

  • పైగా పలు షరతులు విధింపు.. దీంతో హైకోర్టుకు

అమరావతి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్నోయిన వైసీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లేందుకు ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేసుకున్నారు. ఈలోపు బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. బాధితులను పరామర్శించకుండా విమానమెక్కితే విమర్శలు వస్తాయన్న భయంతో రెండ్రోజులు కాసేపు అలా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి.. యథాప్రకారం సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. కృష్ణా నది వరదల్లో ఉండవల్లిలోని తన నివాసం మునిగిపోకుండా ఉండేందుకు బెజవాడను ముంచారని.. బాధితులకు సాయం అందుతున్నా.. అందడం లేదని ఆరోపించి విమర్శల పాలయ్యారు. శనివారం లండన్‌ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న ఆయనకు పాస్‌పోర్టు సమస్య ఎదురైంది.


సీఎం పదవి పోయిన వెంటనే.. ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లమేటిక్‌ పాస్‌పోర్టు రద్దయిపోయింది. అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేటప్పుడు కోర్టు సాధారణ పాస్‌పోర్టు స్వాధీనానికి ఆదేశించింది. దీంతో.. కుమార్తె పుట్టినరోజుకు లండన్‌ వెళ్లడానికి ఆయనకు అనుమతిచ్చిన సీబీఐ కోర్టు.. సాధారణ పాస్‌పోర్టును ఐదేళ్ల పాటు రెన్యువల్‌ చేయాలని ఆదేశించింది. అయితే.. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన పాస్‌పోర్టును పొందేందుకు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో నమోదైన కేసు ఆయనకు అడ్డంకిగా మారింది. ఆ కోర్టు జగన్‌కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కఠిన షరతులు విధించడంతో ఆయన హైకోర్టును అత్యవసరంగా ఆశ్రయించారు. వాస్తవానికి జగన్‌ తన లండన్‌ పర్యటనపై సొంత పార్టీ ముఖ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కోర్టు అనుమతి తర్వాతే వారికా విషయం తెలిసింది. ఇప్పుడు ఆకస్మికంగా ఆయన లంచ్‌ మోషన్‌ వేయడంతో పాస్‌పోర్టు సమ స్య వెలుగులోకి వచ్చింది. ఆయన లండన్‌ పర్యటన ఆలస్యం కానుంది.

Updated Date - Sep 07 , 2024 | 05:17 AM