జనసైనికుడి ఇంటిపై దాడి
ABN , Publish Date - May 06 , 2024 | 01:46 AM
తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీ నివాసం ఉంటున్న జనసేన కార్యకర్త కిషోర్ ఇంటిపై వైసీపీకి చెందిన నాయకుడు కొడుకు జానీ, మరికొందరు మద్యం, గంజాయి సేవించి ఆదివారం రాత్రి మూకుమ్మడిగా దాడి చేశారు.
-గంజాయి మత్తులో గేటు ధ్వంసం చేసి..
అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు
తిరుపతి(నేరవిభాగం), మే 5: తిరుపతిలోని వెంకటరెడ్డి కాలనీ నివాసం ఉంటున్న జనసేన కార్యకర్త కిషోర్ ఇంటిపై వైసీపీకి చెందిన నాయకుడు కొడుకు జానీ, మరికొందరు మద్యం, గంజాయి సేవించి ఆదివారం రాత్రి మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తమ ఇంటి గేటును ధ్వంసం చేయడమేకాక, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ‘మీరు జనసేన పార్టీ తరఫున ఎలా ప్రచారం చేస్తారో మేము చూస్తాం. మీరు ప్రచారం చేస్తే మీ అంతు చూస్తాం’ అని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, నాయకులు హరిప్రసాద్, కిరణ్రాయల్, రాజారెడ్డి, తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భయాందోళనతో ఉన్న బాధితులను ఓదార్చారు. మరోవైపు పోలీసులు వస్తున్నారని తెలియడంతో వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈస్ట్ సీఐ మహేశ్వరరెడ్డి, పోలీసులు చేరుకోగా.. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆరణి, కిరణ్రాయల్ డిమాండ్ చేశారు. లేకుంటే మళ్లీ వచ్చి దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తాము ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే.. వైసీపీ శ్రేణులు మాత్రం రణరంగం సృష్టిస్తున్నాయని వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.