Share News

Pawan Kalyan: కమిట్‌మెంట్‌కు కేరాఫ్ పవన్ కళ్యాణ్‌‌.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..

ABN , Publish Date - Oct 03 , 2024 | 08:34 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. గురువారం తిరుపతి వారాహి సభ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించడంతో వారాహి సభలో పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని..

Pawan Kalyan: కమిట్‌మెంట్‌కు కేరాఫ్ పవన్ కళ్యాణ్‌‌.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..
Pawan Kalyan

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతూ తిరుపతిలోని వారాహి సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలనే డిమాండ్‌ను పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా వినిపిస్తున్నారు. ఇదే అంశంపై డిక్లరేషన్ ప్రకటించేందుకు తిరుపతిలో వారాహి సభను ఏర్పాటుచేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. గురువారం తిరుపతి వారాహి సభ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించడంతో వారాహి సభలో పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని జనసేన డిమాండ్ చేస్తోంది. గతంలో ఎన్నో హైందవ సంఘాలు, స్వామీజీలు ఇదే డిమాండ్‌ను వినిపించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన కట్టుబడి ఉందంటూ సంకల్పం తీసుకున్నారు. దీనిలో భాగంగా నిర్వహించిన వారాహి సభకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇతర మాతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన ఆవశ్యకతను పవన్ కళ్యాణ్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణలో దేశ ప్రజలంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.


ఇచ్చిన మాట ప్రకారం..

సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటానని, ఆ దిశగా తాను అడుగులు వేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలమైన చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిక్లరేషన్‌లో ప్రకటించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు ఇతర మతాలను దూషించరన్నారు. అన్ని మతాలను సమానంగా చూసేది హిందువులని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు దేశ ప్రజలంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మంలో గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ వివరించే ప్రయత్నం చేశారు. ప్రజలకు తాను ఏం చెప్పాలనుకున్నారో స్పష్టంగా చెప్పేశారు.


కమిట్‌మెంట్‌కు కేరాఫ్..

ప్రస్తుతం రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పూటకో మాట మారుస్తున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం విషయంలో తన వైఖరిని స్పష్టంచేశారు. హిందూ దర్మంపై విమర్శలు చేసిన రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని వైరస్‌తో పోల్చినా మౌనంగా ఉండిపోయే పరిస్థితి మారాలన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. సనాతన ధర్మం పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని.. ఇక ముందు తన వైఖరి ఇదేనని స్పష్టంచేశారు. అదే సమయంలో ఇతర మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. తాను కౌలు రైతు కుటుంబాలకు సహాయం చేసినప్పుడు మతాన్ని చూడలేదని.. అందరికీ సహాయం అందించినట్లు తెలిపారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌పై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ముందుగా ప్రజలకు ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం సనాతన ధర్మం పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించి.. దేశ వ్యాప్తంగా ధర్మ పరిరక్షకులు ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. పవన్ డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 03 , 2024 | 08:34 PM