Share News

అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:05 AM

రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

అమరావతిలో  ప్రపంచ బ్యాంకు బృందం

  • సీఎం చంద్రబాబుతో సమావేశం

  • రాజధానికి 15 వేల కోట్ల సాయంపై చర్చలు

అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని కట్టడానికి రూ.15 వేల కోట్ల సాయం అందిస్తామని కేంద్రప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందు లో భాగంగానే ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు ప్రస్తుతం అమరావతిలో పర్యటిస్తున్నారు.

మంగళవారమిక్కడ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. వారి వెంట కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కూడా ఉన్నారు. ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులు ఈ నెల 27 దాకా అమరావతిలోనే ఉండి అన్ని అంశాలనూ పరిశీలిస్తారు.

వీలైనంత త్వరగా ఈ నిధులను సమీకరించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటు రాష్ట్ర అధికారులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, ప్రపంచబ్యాంకు, ఏడీబీ అధికారులు తనతో సమావేశమై అమరావతి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారని చంద్రబాబు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.


సీబీఐకి అనుమతి కొనసాగింపు

రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై చర్యలు తీసుకోవడం, ఇతరత్రా కీలక కేసుల్లో దర్యాప్తునకు సీబీఐ మరో ఏడాది పాటు రాష్ట్రంలోకి నేరుగా రావొచ్చు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం నాడు గెజిట్‌ జారీ చేసింది.

సీబీఐకి ఆరేళ్ల క్రితం ఏపీలోకి అనుమతి నిరాకరిస్తూ అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన సీబీఐకి ప్రతి ఏటా కొనసాగింపు లభిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 30నాటికి గడువు తీరిపోవడంతో ప్రభుత్వం పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Aug 21 , 2024 | 05:05 AM